Tuesday, June 17, 2025

రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హితవు పలికారు. జగిత్యాలలోని నవదుర్గా ఆలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం మహిళలతో కలిసి సామూహికంగా నిర్వహించిన కుంకుమార్చనలో ఆమె పాల్గొన్నారు. ఆలయ నిర్వహకులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ హయాంలో ఆధ్మాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేశామని అన్నారు. జగిత్యాలలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ నిర్మాణం కోసం ఎంపి దామోదర్‌రావు ఎంపి ల్యాడ్స్ నుంచి రూ.90 లక్షలు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ దావ వసంత జెడ్‌పి నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూడా 60 శాతం మందికి మాత్రమే ఇచ్చి మిగతా 40 శాతం మందికి ఇవ్వలేదన్నారు.ఆ 40 శాతం మందికి ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్లు మూడెకరాల భూమి ఉన్న రైతులకే ఇస్తారా… రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో వాగ్ధానాలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రైతు భరోసాతో సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ అధినేత కెసిఆర్, అగ్రనేతలు హరీశ్‌రావు, కెటిఆర్‌కు నోటీసులు ఇస్తూ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో హరీశ్‌రావును, కెసిఆర్‌ను విచారించారని, ఈ రోజు కెటిఆర్‌ను ఎసిబి విచారిస్తోందని అన్నారు. ‘కేసులకు మేం భయపడం… ఏ విచారణకైనా సిద్ధమేనని గతంలో చెప్పాం…. ఇప్పుడూ చెబుతున్నాం’ అని అన్నారు. కెటిఆర్ విచారణ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తాళం వేసి తమ కార్యకర్తలు, నాయకులను బయటకు రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతూ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. తామెప్పుడైనా ప్రజల పక్షాన నిలిచామని, ప్రజల కోసమే పని చేశామన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైనా, రాష్ట్రమొచ్చిన తర్వాత అభివృద్ధ్ది కోసమైనా ప్రజల కోసమే పని చేసినట్లు తెలిపారు.

‘అవతలోడు మాపై దాడికొస్తే మేమంతా ఒక్కటవుతాం’ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీలోని లోపాలను కవిత ఎత్తి చూపిన విషయమై మీడియా ప్రశ్నించగా ఆమె స్పందించారు. ‘ఏ పార్టీ అయినా పార్టీలోని లోపాల గురించి మాట్లాడుకుంటరు.. సవరించుకుంటరు… ముందుకు పోతరు, కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదికి అయినా అవతలోడు దాడికొస్తే కచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం’ అని అన్నారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం కచ్చితంగా మాట్లాడతామన్నారు. ‘ఇంటర్నల్‌గా పార్టీలో జరగాల్సిన మార్పులు, చేర్పులు జరగాలని కోరుకుంటం,

అందులో పెద్ద తప్పేమీ లేదు’ అని అన్నారు. అది జరగకపోతే పార్టీ ముందుకు పోవడం కూడా ఉండదు. దానికి, దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. తమ నాయకత్వం మీద విమర్శలు చేసి పబ్బం గడుపుకుని, రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ నేతలు చూస్తే వారి ప్రయత్నాన్ని కచ్చితంగా వమ్ము చేస్తామన్నారు. అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయని, వాటిని కూడా తప్పకుండా మాట్లాడుకుంటాం.. వీటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News