Sunday, June 15, 2025

కెసిఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కాళేశ్వరం కుప్పకూలింది:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

గత బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకల మీద విచారణ జరుగుతుందని ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏముందని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కాళేశ్వరం కుప్పకూలిందని ఆయన ఆరోపించారు. తాము ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయకుండా తప్పులు చేస్తే రేపు మాపై కూడా కమిషన్లు వస్తాయన్నారు. కెటిఆర్ కంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఉన్నారని వారెవరు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఇంతలా విషబీజాలు నాటలేదని ఆయన ఆరోపించారు. నిన్నటి వరకు దయ్యాలు అని మాట్లాడిన సిస్టర్ ఇవాళ సెంటిమెంట్ స్టార్ట్ చేశారని, కెసిఆర్ ఫ్యామిలీ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తుందని ఆయన అన్నారు. ఒక్క దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజాన్ని 24 గంటలు తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతోనే కెసిఆర్ కుటుంబం ఉందన్న విషయం క్లియర్‌గా అర్థం అవుతోందన్నారు.

ప్రతిపక్షాలు తమ పాత్రను సక్రమంగా నెరవేర్చడం లేదు
ప్రతిపక్షాలు తమ పాత్రను సక్రమంగా నెరవేర్చడం లేదని, ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఆయనకు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదని ఆయన ఎద్దేవా చేశారు. తమ సిఎం, మా మంత్రులు ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారని ప్రతిపక్ష హోదా అంటే ట్వీట్లు చేయడం కాదని ఆయన సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా నిర్మించి పంటలకు నీళ్లిస్తే ఇవాళ పిసి ఘోష్ కమిషన్ రావాల్సిన అసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును చైనా వంటి దేశాలే 18 ఏళ్లలో నిర్మిస్తాయని అలాంటిది కెసిఆర్ నాలుగేళ్లలోనే నిర్మించారని కెటిఆర్ చెబుతున్నారంటేనే కమీషన్లు దండుకునేందుకే తొందరగా నిర్మించినట్లు అర్థం అవుతుందన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తి పడకుంటే నేడు పిసి ఘోష్ కమిషన్ వచ్చేది కాదన్నారు. ఇది కక్ష సాధింపు రాజకీయాలు కావని కేవలం వారు చేసిన కర్మపాలనకు అనుభవిస్తున్న పరిస్థితి అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News