కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రూపు 1 ఉద్యోగ నియామకాలు జరగరాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలలో 563 అభ్యర్థుల వద్ద మూడు కోట్ల రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వం వాళ్ళను ఎంపిక చేసిందని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపి చామల ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆయన విమర్శించారు. మీ హయాంలో గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3, గ్రూపు 4 పెట్టే పరిస్థితి లేకుండేదని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహారిస్తున్నదని ఆయన తెలిపారు.
గ్రూపు 1పై ఎటువంటి అడ్డంకులు లేకుండా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ప్రభుత్వం ముందుకెళుతున్నదని ఆయన పేర్కొన్నారు. 563 మంది తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి మూడు కోట్ల రూపాయలు చెల్లించే స్థోమత ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో చదువుకుని, అక్కడే ఉద్యోగం చేస్తూ చివరకు భారత దేశానికి వచ్చి మంత్రి పదవి చేపట్టిన కెటిఆర్కు నిరుద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పటిస్తున్న కెటిఆర్కు రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు తగు గుణపాఠం చెప్పాలని ఎంపి చామల కోరారు.
Also Read: సింగరేణి మనుగడును ప్రభుత్వం కాపాడాలి:కొప్పుల ఈశ్వర్