Wednesday, June 25, 2025

ఉగ్రవాదుల్లాగా నా పై నిఘా పెట్టారు: ఎంపి ఈటెల

- Advertisement -
- Advertisement -

మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు
రిటైర్డు అయిన ప్రభాకర్ రావుకు కీలక పదవి ఎలా కట్టబెట్టారు
ఫోన్ ట్యాపింగ్‌పై మీకు చేతగాకపోతే సిబిఐ విచారణకు అప్పగించండి
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం వల్లనే విచారణల్లో జాప్యం
సిట్ ఎదుట హాజరయిన బిజెపి ఎంపి ఈటెల రాజేందర్, ప్రేమేందర్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులపై నిఘా ఉంచినట్టుగా గత ప్రభుత్వం నాపై నిఘా పెట్టి ఫోన్లు ట్యాప్ చేయించిందని సీనియర్ నేత, మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం సిట్ ఎదుట హాజరైయి తన వాంగ్మూళం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఫోన్ ట్యాప్ అయిన తన ఫోన్ నెంబర్ల జాబితాను సిట్ అధికారులు తెలిపారన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత స్వేచ్చను హరించిందని మండిపడ్డారు. నాడు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి ప్రజల స్వేచ్ఛను హరిస్తే, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తుల స్వేచ్చను హరించిందని ధ్వజమెత్తారు.

రాజ్యంగం కల్పించిన స్వేచ్చను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. మా కుటుంబ సభ్యులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, రాజకీయ సహచరులు, వ్యక్తిగత సహాయకులతో పాటు తన భార్య జమునకు సంబంధించిన హ్యచరీస్ ఉద్యోగులు, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసారని ఈటల ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసినట్టు వివరించారు. అలాగే గత ఎన్నికలలో గజ్వేల్, హుజూరాబాద్‌లో పోటీ చేసినప్పుడు కూడా ఫోన్ ట్యాప్ చేసారని, తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఈటెల ధ్వజమెత్తారు. ఐపిఎస్ అధికారి కాకపోయినా ప్రభాకర్ రావును ఉన్నత స్థాయి పదవీలో కూర్చోపెట్టారని విమర్శించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన నిఘా విభాగాలు ముఖ్యమంత్రి వద్ద ఉంటాయని, అర్హత లేకపోయినా ఉన్నతాధికారిగా విధులు నిర్వహించిన ప్రభాకర్ రావుకు మాజీ సీఎం కెసిఆర్‌కు ఉన్న సంబంధం ఏమిటో బయటపెట్టాలని ఈటల డిమాండ్ చేశారు.

ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేశామని, అలాగే ఇందుకు సంబంధించిన సాక్షాధారాలు, ధ్వంసం చేశామని ఈ కేసులో నిందితులు చెపుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరగుతుందని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారో విచారణ చేసి దోషులను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భార్య, భర్తలు మాట్లాడుకున్న ఫోన్‌లు వినడం ఎంతటి దుర్మార్గమైన చర్య అని, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే భయపడే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు, ఫోన్ ట్యాపింగ్ విచారణ చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా విచారణ నత్తనడకన నడుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందాల వల్లనే విచారణ ముందుకు పోకపోవడానికి కారణమని ఈటెల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే తాము సిబిఐ విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా చేస్తామని ఈటల సవాల్ చేసారు.

ఈ ప్రభుత్వమూ ఫోన్ ట్యాపింగ్ చేయదన్న గ్యారంటీ లేదు: ప్రేమేందర్ రెడ్డి
ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదని నమ్మకం ఏమిటని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రేమేందర్ రెడ్డి సిట్‌కు తన వాంగ్మూలం వినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన రెండు ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు చెప్పినట్టు ఆయన తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్‌తో నిరంతరం పార్టీ కార్యక్రమాలపై నిఘా పెట్టారని అన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా ఫోన్లు ట్యాప్ చేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసారు. సిట్ అధికారులు సుమారు నాలుగు వేల ఫోన్లు ట్యాప్ అయినట్టు చెపుతన్నా, కేవలం 600 మందిని మాత్రమే విచారిస్తామని చెబుతున్నారని, అలా అయితే న్యాయస్థానంలో ఈ కేసులు ఎలా నిలబడతాయని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News