ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి
సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : జూలై మొదటి వారంలో జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . మొహర్రం ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆశుర్ ఖానాల పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్, రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబందిత అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు మొహర్రం రోజు ఏనుగు ఊరేగింపు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, వాటర్ బోర్డ్ అధికారులు త్రాగు నీరు అందించాలని, జిహెచ్.ఎంసి అధికారులు పారిశుథ్య పనులను పర్యవేక్షించాలని అన్నారు. మొబైల్ టాయిలెట్స్ తదితర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆర్ అండ్ బి అధికారులు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాన ఊరేగింపు ప్రారంభం కానున్న బీబీ-కా-ఆలం పరిసరాల ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌళిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, చార్మినార్, బహదూర్పురా, యాకత్ పురా, నాంపల్లి, కార్వాన్ ఎంఎల్ఎలు మీర్ జుల్ఫెకర్ అలీ, మహమ్మద్ ముబీన్, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, ఎంఎల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్, అమీర్ అలీ ఖాన్, బల్మూరి వెంకట్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్, జిహెచ్ఎంసి కమీషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ ఎండి అశోక్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, వక్ఫ్ బోర్డు సిఈఓ తదితరులు పాల్గొన్నారు.