Sunday, September 14, 2025

సాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 26 క్రస్ట్ గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తుండటంతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం జలాశయం 7 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,93,634 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 66,280 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,81,352 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రస్ట్‌గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,09,794 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.70 అడుగులవద్ద నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతానికి 311.1486 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 32,764 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 9,019 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 6,325 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,60,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. కృష్ణమ్మ పరవళ్లు చూసి పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధవనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News