టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టిఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘వార్-2’ చిత్రం ఆగస్టు 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ (Nagavamshi) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో ఆయన పలు కీలక అప్డేట్లు ఇచ్చారు. ఎన్టిఆర్-త్రివిక్రమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వార్-2 సినిమాలో ఎన్టిఆర్ పరిచయ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలుస్తుందని.. ఆ తర్వాత హృతిక్-తారక్ల ఫైట్ సీన్ చూసే ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని నాగవంశీ (Nagavamshi) అన్నారు. ఇద్దరు హీరోలు హోరాహోరీగా తలపడితే.. ఎలా ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టిఆర్ ఈ సినిమాలో కొంత సమయమే ఉంటారని వస్తున్న వార్తలు అవాస్తవమని.. హృతిక్, ఎన్టిఆర్లు సినిమా అంతా కనిపిస్తారని చెప్పి ఫ్యాన్స్ని ఖుషీ చేశారు.
ఇక ఎన్టిఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రకటనపై కూడా నాగవంశీ పలు విషయాలు వెల్లడించారు. ‘‘ఈ సినిమా ప్రకటించడాన్ని భారీగా ప్లాన్ చేశాం.. త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు. ‘రామాయణ’ సినిమా ప్రకటనతో దేశం మొత్తం దాని గురించే మాట్లాడుకుంటుంది. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలనే ఆగాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఆగస్టులో వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఈ సినిమా ప్రారంభమవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టిఆర్ను రాముడు, కృష్ణుడిగా చూశామని.. ఇప్పుడు తారక్ను అలా చూపించాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.