నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ అర్ధాంగి పద్మజ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పద్మజ వయసు 73 సంవత్సరాలు. ఆమె స్వయానా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. కాగా హైదరాబాదులో నందమూరి పద్మజ భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. పద్మజ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అత్త తర్వాత పద్మజ కుటుంబ పెద్దగా ఉండేవారని తెలిపారు.
తన పెళ్లి సమయంలోనూ పద్మజ, -జయకృష్ణ దంపతులు అన్ని విషయాలు పర్యవేక్షించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పద్మజ మృతి ముఖ్యంగా జయకృష్ణ కి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. గతంలో తాను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జయకృష్ణ ఎగ్జిబిటర్ గా ఉండేవారని చంద్రబాబు వెల్లడించారు. ఎగ్జిబిటర్ గా ఆయన తనవద్దకు వస్తూపోతూ ఉండేవారని, ఆయన ద్వారానే తనకు ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయం ఏర్పడిందని వివరించారు. ఇక, పద్మజ కూడా అందరితో కలిసిపోయేవారని, ఆమె మృతి ఎంతో వేదన కలిగిస్తోందని అన్నారు.