మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు డీఎస్సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో గురువారం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, పోలీస్ సిబ్బందితో పాటు నార్కోటిక్ డాగ్ స్వాడ్ను వినియోగించి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పాన్ షాపుల పేరుతో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయాన్ని ఏలాగైనా అరికట్టాల్సిందేనని, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఈ ప్రమాదకర పదార్ధాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, నార్కోటిక్ డాగ్ స్కాడ్ సాయంతో ప్రతి షాప్ను జాగ్రత్తగా తనిఖీ చేసి, అనుమానాస్పద పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాన్ షాపు యజమానులు నిబంధనలను పాటించకపోతే షాపుల మూసివేత సహా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.