Friday, June 27, 2025

పాక్‌కు కీలక సమాచారం లీక్…నేవీ ఉద్యోగి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు రహస్యంగా చేరవేస్తున్న ఓ నేవీ ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ లోని నేవల్ హెడ్ క్వార్టర్స్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న హర్యానాకు చెందిన విశాల్ యాదవ్‌ను రాజస్థాన్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అతడు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకి కీలక సమాచారం చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.విశాల్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా పాక్ హ్యాండ్లర్‌తో సంప్రదింపులు కొనసాగించే వాడిగా గుర్తించారు. ప్రియాశర్మ అనే పేరు ఉపయోగించి ఆ పాక్ మహిళా హ్యాండ్లర్ తాను భారతీయురాలినని నమ్మించి, అతడికి డబ్బు ఆశ చూపి , భారత నౌకాదళానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. అతని ఫోన్‌ను పరిశీలించిన తర్వాత నేవీతోపాటు ఇతర రక్షణ విభాగాల కీలక సమాచారం లీక్ చేసినట్టు వెల్లడైంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమాచారం కూడా పాకిస్థాన్‌కు చేరవేసినట్టు గుర్తించారు.

ఈ సమాచారం అందించినందుకు నిందితునికి రూ. 50 వేలు ముట్టిందని సిఐడీ ఐజీ గుప్తా పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై డబ్బులు కోల్పోయిన అతను, ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ చర్యలకు పాల్పడినట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ వాలెట్‌లు, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు స్వీకరించినట్టు ఆధారాలు లభించాయని సీఐడీ ఐజీ విష్ణుకాంత్ గుప్తా తెలిపారు.మొదట్లో యాదవ్ తక్కువ గ్రేడ్ సమాచారం అందించినందుకు రూ. 5000 నుంచి రూ. 6000 వరకు ముట్టజెపేవారని, ఇంకా విలువైన సమాచారం అందించాలని పాకిస్థాన్ హ్యాండ్లర్ ప్రోత్సహించడంతో రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని అందించడం ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత ఆధునిక పద్ధతులను ఉపయోగించి భారత రక్షణశాఖు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారని, అలాంటి వ్యవహారాల పట్ల మనం అప్రమత్తంగా గమనించాల్సి ఉందని గుప్తా సూచించారు. ఈ గూఢచర్యంలో మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News