నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పిజి 2025) ప్రవేశ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎన్ఇబి) ఈ పరీక్షకు కొత్త తేదీని ప్రతిపాదించగా.. అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ఇబి అభ్యర్థన మేరకు పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. పరీక్షను రెండు షిఫ్ట్లలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది. రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకేవిధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కూ ర్యాంకు నిర్థారణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాదీ నిర్వహించుకొనే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది. నీట్ -పిజి 2025ని రెండు ఫిఫ్ట్లలో నిర్వహిస్తారంటూ వెలువడిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉన్నందున సురక్షితమైన పరీక్షా కేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకొనే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నీట్ పిజి పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది.