మిస్ వరల్డ్ పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టడం లేదని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న నాణ్యత లేని భోజనంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బుధవారం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వేములవాడ దేవాలయాన్నీ సందర్శించినప్పుడు హైదరాబాద్ నుంచి 32 వేల రూపాయలకు ప్లేటు చొప్పున భోజనం తెప్పించుకుని తిన్నారని విమర్శించారు.
కానీ పేద విద్యార్థులకు కారం నీళ్ల భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్తు అయిన విద్యార్థులకు నీళ్ల సాంబార్ భోజనం పెట్టడమే ప్రజా పాలనలో సాధించిన విజయమా అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు 90 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రికి కనీసం వారి మరణాలను గుర్తించే సమయం కూడా లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను కనీసం మనుషులుగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించదా అని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించడం కూడా చేతకాదా అని ఆ ట్వీట్లో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.