ఇటీవల కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని హడల్ ఎత్తించాయి. ఈ సంఘటనలతో దాదాపు అన్ని దేశాల అధినేతలు, పాలకులు, ప్రభుత్వాలు చాలా గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు చాలా ఓపిక, సహనం కలిగి ఉంటారు. ఓటు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పత్రికలు ద్వారా, భావప్రకటన ద్వారా తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు. ఇవేమీ పట్టించుకోకుండా, అధికారం చేతిలో ఉంది అని మూర్ఖంగా ముందుకుపోయే ప్రభుత్వాలకు ప్రజలు ముఖ్యంగా యువత ఏ రకంగా బుద్ధి చెబుతుందో గతంలో శ్రీలంకలో జరిగిన పరిణామాలు, తాజాగా నేపాల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో ప్రజలు, యువత ఇంత బాహాటంగా పాలక వర్గంపై హింసాత్మక ఘటనలతో రెచ్చిపోవడానికి ప్రధానకారణాలు పాలకుల అవినీతి, బంధుప్రీతి అని గ్రహించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అవినీతి, బంధుప్రీతికి పెద్దపీట వేసి, ప్రజల అవసరాలు పక్కనపెట్టడంతో చివరికి విసుగుచెందిన ప్రజలు, యువత ప్రత్యక్ష చర్యలకు పాల్పడి పాలకులను పారద్రోలుతున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్వార్థం వదులుకుని ప్రజలకు సేవ చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రజల అవసరాలు తీర్చాలి, వారి అభిప్రాయాలను గౌరవించి తదనుగుణంగా పాలన అందించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాదర్బార్ తరచూ నిర్వహిస్తూ ప్రజాసమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. కానీ నేటి పాలకులు ఎన్నికైన వరుకూ ప్రజలే దేవుళ్ళు అంటూ పొగిడి, ఓట్లు, సీట్ల దండుకుని తదుపరి ప్రజలకు దూరం జరగడంతో ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు. అవినీతి, బంధుప్రీతి భారీస్థాయిలో చేయడం, అధికారం అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో నడవడంతో చివరికి దేశం విడిచి పారిపోయే పరిస్థితి, ప్రాణసంకటంతో బతికే పరిస్థితి తెచ్చుకోవడం జరుగుతున్నది.
ఇకనైనా పాలకుల స్వభావం మారాలి. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ సర్వే సంస్థలు వెలువరించిన నివేదికలు ప్రకారం ముఖ్యంగా అవినీతిలో శ్రీలంక 121వ స్థానంలో, బంగ్లాదేశ్ 151వ స్థానంలో, నేపాల్ 107వ స్థానంలో, ఇక భారతదేశం 96వ స్థానంలో ఉంది. అనగా ఈ దేశాల్లో అవినీతి, బంధుప్రీతి ఎంతగా విస్తరించి ఉందో తేటతెల్లం అవుతున్నది. ‘మానవసేవే- మాధవసేవ’ అని, ‘ప్రజాసేవే -పరమావధి’ అని నమ్మబలుకుతూ, ప్రమాణంచేసే సమయంలో ఆయాదేశాల రాజ్యాంగ ప్రకారం, వారి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ, ప్రమాణం చేసిన పాలకులు నిజ జీవితంలో ముఖ్యంగా అధికారం చేపట్టిన తరువాత విచ్చలవిడిగా అవినీతి, బంధుప్రీతితో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయడంతో, మోసపోయిన ప్రజలు పోరుబాట పడుతున్నారు. తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు. ఇక అన్ని దేశాల పాలకులు కళ్ళు తెరవాలి. తమ పాలనను సమీక్షించుకోవాలి. పారదర్శకంగా పరిపాలన అందించాలి. ప్రజల మన్ననలు పొందాలి.
భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో రాజకీయ అవినీతి, బంధుప్రీతి పెచ్చుమీరుతున్నది. ప్రశ్నించే గొంతులను అణగదొక్కాలని చూడటం జరుగుతుంది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోరాదు. ప్రజల అవసరాలు పాలకులు తీర్చాలి. గత ప్రభుత్వాలు ఎంతమేరకు నిధులు నిల్వలు ఉంచారో తెలిసే కదా! ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రజలకు, యువతకు అనేక వాగ్దానాలు ఇచ్చి, ఓట్లు సీట్ల దండుకుని, తీరా అధికారం చేపట్టిన తరువాత వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలకు, యువతకు ఆగ్రహం రాక ఏమవుతుంది! ఎల్లకాలం ప్రజలు, యువత అమాయకులు కాదు అని ఇకనైనా గ్రహించండి, మారండి. ముఖ్యంగా అవినీతి, బంధుప్రీతి వదులుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటూ, కనీసం శాసనసభ సమావేశాలకు, శాసనమండలి సమావేశాలకు, పార్లమెంటు సమావేశాలకు రాకుండా వేతనాలు తీసుకోవడం మంచిది కాదు. భవిష్యత్లో జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గం ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు! మీ ప్రాంతాల ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి. ఇకనైనా ఆలోచన చేయాలి.
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు ప్రజల మనిషిగా ఉండాలి. సొంత వ్యాపారాలు పెంచుకోవడం, సొంత సంపద పెంచుకోవడం కోసం రాజకీయ అవతారాలు ఎత్తడం సరికాదు. ఏదో ఒక సమయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని మన ఇరుగు పొరుగు దేశాల పరిస్థితులు బట్టి తెలుస్తోంది. మన దేశంలో కూడా ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ, ప్రజాప్రతినిధుల అవినీతి, బంధుప్రీతి తారస్థాయికి చేరుకుంటున్నది. ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేయండి. పారదర్శక పాలన అందించాలి. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్య్రం సమరయోధుల ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చండి. దేశంలో ఉన్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి. నిరక్షరాస్యత, అనారోగ్యం, పేదరికం కూకటివేళ్లతో పెకలించాలి. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటుచేసిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అవినీతి, బంధుప్రీతి రహితంగా విధులు నిర్వహించాలి. లేకపోతే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని గ్రహించాలి. ప్రజలందరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ అందించే పని పాలకులు చేపట్టాలి. విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి. బడ్జెట్ల్లో అధిక నిధులు సమకూర్చాలి. అధిక ధరలు, ప్రైవేటీకరణకు ముకుతాడు వేయాలి. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలతో సుస్థిర అభివృద్ధి అసాధ్యం అనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి. వికసిత భారత్గా దేశం భవిష్యత్తులో మారాలి అంటే ముఖ్యంగా పాలకులు పారదర్శకంగా పరిపాలన అందించడంతో మాత్రమే సాధ్యం. ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. జీవన ప్రమాణాలు కలిగి ఫిన్లాండ్, స్వీడన్, నార్వే వంటి దేశాలు సరసన మన భారత్ చేరుతుంది. అవినీతి, బంధుప్రీతి రహిత దేశంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా పాలకులు మన దేశాన్ని తీర్చిదిద్దుతారు అని ఆశిద్దాం. ఇరుగు పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలకు కనువిప్పు కావాలి.
Also Read: పాలకుల అవినీతే అసలు కారణం
ఐ ప్రసాదరావు, 63056 82733