మనం ఒక మహా రాక్షసుని గురించి రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో విన్నాము. తన గురించి చదవటం, వినటం, సినిమాలలో చూడటం తప్ప ఈ తరానికి ప్రత్యక్షంగా ఏమీ తెలియదు. ఆ రాక్షసుడు సుమారు 60 లక్షల మంది యూదులను, మరికొన్ని లక్షల మంది ఇతరులను నిలువునా ప్రాణాలు తీసాడు. ఆయన ప్రారంభించిన రెండవ ప్రపంచ యుద్ధంలో మొత్తంగా చనిపోయిన వారు, గాయపడిన వారు 5 కోట్లనుంచి 8 కోట్లకుపైగా ఉంటారని అంచనా. ఆ విధంగా మొత్తం మానవాళి చరిత్రలోనే అంతటి మారణహోమం ఎప్పుడూ జరగలేదు. మొదటి ప్రపంచ యుద్ధం సహా.ఇందులో ప్రస్తుత చర్చకు సంబంధించి యూదుల విషయం చెప్పుకోవాలి. వారిలో చిన్నా పెద్దా, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెతికి వెతికి మరీ చంపించాడు ఆ రాక్షసుడు. తమ దేశంలోనే గాక, యుద్ధ క్రమంలో తాము ఆక్రమించిన ప్రతి ఒక్క దేశంలో. మొత్తం యూదు జాతినంతటినీ అంతం చేయగలనని బాహాటంగా ప్రకటించాడు.
ఆ రాక్షసుడు ఎవరో చాలామందికి అర్థమయే ఉంటుంది. తన పేరు అడాల్ఫ్ హిట్లర్. దేశం జర్మనీ. ఆయన రాసిన తన ఆత్మకథ ‘మీన్ కాంఫ్’ (జర్మన్ భాషలో ‘నా కథ’). దానిని కొందరు చదివే ఉంటారు. తనకు టీనేజ్ నుంచే యూదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులంటే పరమ ద్వేషం. రాజకీయ పార్టీ నెలకొల్పిన తర్వాత అందుకు కార్యాచరణ రూపం వస్తుండగా, అధికారానికి వచ్చిన వెనుక ప్రత్యక్ష హత్యాకాండ మొదలైంది.ఈ ప్రస్తావనలన్నీ ఎందుకంటే ఆ విధంగా హిట్లర్ విద్వేషానికి, మారణహోమానికి బలైన యూదుల వారసుడు అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, హిట్లర్ జాతి విద్వేషాన్ని కూడా తనకు వారసత్వంగా తెచ్చుకుంటూ మనకాలపు మహా రాక్షసునిగా మారి, గాజాలో గత ఏడాదిన్నరగా 60 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలను కాల్చి చంపించాడు.
అందులో స్త్రీలు, పిల్లలు 80 శాతమని అంచనా. తక్కిన 20 శాతంలో అనేకులు వృద్ధులు. ఇది గాక, పాలస్తీనాలోని రెండవ భూ భాగమైన వెస్ట్ బ్యాంక్లో కొన్ని వందల మంది ప్రాణాలు తీసారు. ఇదంతా నేటికీ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా లెక్కలేనన్ని ఆస్పత్రులు, పాఠశాల భవనాలు, ఇళ్లు, ఇతర నిర్మాణాలను కూల్చివేసి ఇంకా కూల్చుతున్నాడు. ప్రజలకు ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందనివ్వటం లేదు. ఐక్యరాజ్య సమితితోపాటు ఇతర దేశాలు పంపుతున్న ఆహారం, మందులు గాజాకు చేరకుండా గత 80 రోజులుగా పూర్తి బ్లాకేడ్ విధించాడు. యావత్ ప్రపంచం ఎంత ఖండించినా లెక్కించటం లేదు. నెతన్యాహును మన కాలపు మహా రాక్షసుడని, హిట్లర్ వారసుడని అనటం అందువల్లనే. దీనంతటి నేపథ్యపు చర్చలోకి వెళ్లే ముందు, ఇటీవలి వారం రోజుల పరిణామాల గురించి చెప్పుకోవాలి.
నెతన్యాహూ చర్యలను ప్రపంచమంతా గతం నుంచి వ్యతిరేకిస్తుండగా, ఇజ్రాయెల్కు గట్టి మద్దతుదారులైన అమెరికా, యూరప్లలోనూ పునరాలోచనలు మొదలయ్యాయి. ఆ పాపాలను ఇక మోయలేకపోతున్నట్లున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొద్ది వారాలుగా నెతన్యాహూ పట్ల విముఖంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన ఆయన ఇజ్రాయెల్ను మాత్రం దాటవేసారు. ఈనెల 25 న మరొక అడుగు ముందుకు వెళ్లి, ఈ యుద్ధాన్ని ఇక ముగించాలని నెతన్యాహూను హెచ్చరించారు. యూరోపియన్ దేశాల వైఖరి, నిజమో నటనలో గాని అంతకన్న కఠినంగా మారుతున్నది. స్పెయిన్, నార్వే, ఐర్లండ్లు ఇప్పటికే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించగా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు తాము కూడా గుర్తించే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే విషయమై స్పెయిన్ చొరవ తీసుకుని 25న యూరోపియన్, అరబ్ దేశాల సమావేశాన్ని నిర్వహించింది. ఇజ్రాయెల్తో వాణిజ్య చర్చలను బ్రిటన్ అర్ధంతరంగా నిలిపివేసింది. అదే నిర్ణయం తామంతా తీసుకోవాలంటూ నెదర్లాండ్ ఏర్పాటు చేసిన సమావేశంలో, 27లో 17 యూరోపియన్ దేశాలు ఆ తీర్మానాన్ని బలపరచాయి. పాలస్తీనా గుర్తింపును జూన్లో సౌదీ అరేబియాతో చర్చించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది.
యూరప్లో ఇజ్రాయెల్కు అన్నింటికన్న పెద్ద మద్దతుదారైన జర్మనీ సైతం నెతన్యాహూ ధోరణిని ఖండించింది.
కాని ఇవేమీ లెక్కచేయని ఇజ్రాయెల్ ప్రధాని ఒక్కరోజైనా ఆపకుండా గాజాపై దాడులు జరిపిస్తూ, ప్రతి రోజూ కొన్ని డజన్ల మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. పైగా, ఇటువంటి అమానుషం తగదంటున్నందుకు యూరోపియన్ నాయకులపై ఎదురు విమర్శలు సాగిస్తున్నాడు. వారు హమాస్ సమర్థకులని, ఆసంస్థ “దుర్మార్గాలను” సమర్థిస్తున్నారని నిందిస్తున్నాడు. అదే సమయంలో తన పథకం ఏమిటో దాపరికం లేకుండా ప్రకటిస్తున్నాడు. దాని ప్రకారం, పాలస్తీనా దేశాన్ని ఎప్పటికీ ఏర్పడన్విడు. ఆ మాట తన జీవిత చరిత్రలో ఎప్పుడో రాసాడు. గాజాలోని 20 లక్షలకు పైగా ప్రజలందరినీ నిర్మూలిస్తాడు, లేదా ఇతర దేశాలకు వెళ్లగొడతాడు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. అక్కడ యూదులను సెటిల్ చేస్తాడు. మరొకవైపు వెస్ట్ బ్యాంక్ అసలు పాలస్తీనాయే కాదని, ఇజ్రాయెల్లో భాగమని ఎప్పుడో ప్రకటించినందున, ఆ మేరకు అక్కడ వేలాదిగా యూదులను సెటిల్ చేయటం సంవత్సరాల క్రితమే మొదలైంది.
ఆ చర్య అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఐక్యరాజ్య సమితితో పాటు పలు పాశ్చాత్య దేశాలు విమర్శించినా లెక్క చేయటం లేదు. అక్కడి పాలస్తీనియన్లపై యూదు సెటిలర్లు తమ సైన్యం సహాయంగా సాగిస్తున్న అత్యాచారాలు, హత్యలు, భూఆక్రమణలు నిత్యకృతమైపోయాయి. అక్కడ నామమాత్రంగా గల పాలస్తీనా అథారిటీ ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ ఇజ్రాయెల్దే. అందుకే ఆ ప్రభుత్వం గాజా దురంతాలపై అసలు నోరెత్తటం లేదు. తక్కిన ప్రపంచంతో పాటు ఇపుడు పాశ్చాత్య దేశాలు ఖండిస్తున్నా మాట్లాడటం లేదంటే, యాసిర్ అరాఫాత్ వారసులుగా అధికారానికి వచ్చిన వారు కేవలం అధికారం, ధనార్జన కోసం ఎంతగా పతనమయారో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కొత్త విశేషం కూడా కనిపిస్తున్నది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇజ్రాయెల్ను సమర్ధించే అమెరికా విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే తన వ్యాపార ధోరణిలో అందుకొక కొత్త రంగు తెచ్చారు. అది, పాలస్తీనియన్లను గాజా నుంచి ఇతర దేశాలకు తరలించి అక్కడ అమెరికా ఆధ్వర్యంలో “అందమైన రిసార్ట్”ను అభివృద్ధి పరచగలమని. ఈ విషయం తెలిసిందే.
కాని అరబ్ దేశాల నుంచి, తక్కిన ప్రపంచం నుంచి తీవ్ర విమర్శలు రావటంతో వెనుకకు తగ్గటం కూడా తెలిసిందే. ఇటీవల ఆయన మాట మాట్లాడటం లేదు. కాని, తెర వెనుక నుంచి తన ఆమోదం ఉన్నదో లేక అదే ఆలోచనను తన అజెండా పైకి తెచ్చుకునో తెలియదు గాని, రిసార్ట్ మాటను నెతన్యాహూ ప్రకటిస్తున్నాడు. గాజా ప్రజలను ఇతర దేశాలకు తరలించేందుకు ట్రంప్ మొదట కొన్ని దేశాలతో సంప్రదించగా ఎవరూ అంగీకరించలేదు. అమెరికా అధ్యక్షుని ప్రయత్నాలే విఫలమైనపుడు ఇజ్రాయెల్ ప్రధాని సఫలంకాగల అవకాశం ఎంతమాత్రం ఉండదు. ఇది గ్రహించలేని వాడు కాదాయన. అయినప్పటికీ, ఒకవైపు హత్యాకాండ సాగిస్తూ మరొక వైపు అందుకు భీతిల్లి గాజా ప్రజలు తమంత తాము ఇతర దేశాలకు పారిపోగలరని ఆశిస్తున్నాడు. కాని తాజాగా ట్రంప్ వైఖరిలో ఒక మేర మార్పు, యూరప్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతతో ఏమి జరగవచ్చునో చూడవలసి ఉంది. పాలస్తీనాకు సంబంధించి ప్రపంచమంతా మొదటి నుంచి గుర్తించి ఇపుడు యూరప్ కూడా క్రమంగా గుర్తిస్తున్న విషయం ఒకటున్నది. అది, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటు, అందుకు ఇరువురి రాజీ మినహా సమస్యకు వేరే పరిష్కారం లేదు, ఎప్పటికీ ఉండబోదన్నది.
ఈ సూత్రాన్ని అందరూ గుర్తించి వ్యవహరించి నట్లయితే ఈ సమస్య కొనసాగేది కాదు. కాని ససేమిరా అంటూ వస్తున్నది ఇజ్రాయెల్. ఆ వైఖరికి మద్దతు ఇచ్చే పాశ్చాత్య దేశాలు, ఈ స్థితిని మన కాలపు మహా రాక్షసుడు తన చర్యల ద్వారా పరాకాష్ఠకు తీసుకు వెళుతున్నాడు. మిగిలిన ప్రపంచం ఐక్యరాజ్యసమితి ఎంత ఒత్తిడి చేసినా తన వైఖరి మారేది కాదు. అమెరికా సహా యూరోపియన్ దేశాలు ఇటీవల మార్చుకుంటున్న తమ విధానాలను అదే విధంగా కొనసాగించటం, వాటిలో కొన్ని ప్రతిపాదిస్తున్నట్లు ఇజ్రాయెల్కు ఆయుధాలు, నిధుల సరఫరా నిలిపివేయటం, వాణిజ్య సంబంధాలను సస్పెండ్ చేయటం వంటివి జరిగితే తప్ప పరిస్థితి మారే అవకాశం లేదు. ఆ విధంగా వ్యవహరించేటట్ల అరబ్ రాజ్యాలు ప్రపంచ దేశాలు పాశ్చాత్య ప్రభుత్వాలను ఒత్తిడి చేయాలి.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- ( రచయిత సీనియర్ సంపాదకులు)