ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత జట్టు చాలా చోట్ల పొరపాట్లు చేసింది. బ్యాటింగ్లో టైయిలెండర్స్ పరుగులు చేయలేకపోవడం, బౌలింగ్లో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో ఇబ్బంది పడటం.. మరి ముఖ్యంగా క్యాచులు వదిలేయం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. ఈ మ్యాచ్లో యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచాడు. అందులో ప్రధానంగా బెన్ డక్కెట్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో అతని క్యాచ్ను వదిలేశాడు. దీనిపై నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
మ్యాచ్లో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ (Yashasvi Jaiswal) డ్యాన్ చేస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ‘నీకు అసలు బుద్ధుందా..? అన్ని క్యాచులు వదిలేసి.. ఇంగ్లండ్ విజయానికి పరోక్షంగా కారణమయ్యావు. అయినా బాధ లేకుండా డ్యాన్స్ చేస్తావా?’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘విరాట్ కోహ్లీని కాపీ కొట్టాలని ట్రై చేస్తున్నావా? నువ్వు ఎప్పటికీ కింగ్ కాలేవు’ అని మరికొందరు అంటున్నారు. ఇంకొదరు అభిమానులు మాత్రం జైస్వాల్కు మద్దతు ఇస్తున్నారు. ఒక యువ ఆటగాడిపై అంత ద్వేషం ఎందుకు అని అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 364 పరుగులు చేసి ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం ఇచ్చింది. ఇంగ్లండ్ బ్యాటింగ్లో బెన్ డక్కెట్ (149) సెంచరీతో, క్రాలీ, రూట్లు అర్థశతకాలతో రాణించడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాదించింది.