రాష్ట్రంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా త్వరలోనే ఈ పథకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఇతర సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహాను కలిశారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు త్వరలోనే నూతన ఆరోగ్య పథకం తీసుకరాబోతున్నట్లు మంత్రి దామోదర వారికి హామీ ఇచ్చారు.
ఏ ఉద్యోగి కూడా బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. గతంలో ఉద్యోగుల జేఏసి ఏ పథకం కావాలని కోరిందో ఇప్పుడు అదే పథకం అందుబాటులోకి రాబోతుందని మంత్రి దామోదర వారికి హామీనిచ్చారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు సంబంధించన నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. మంత్రిని కలిసిన వారిలో రమేష్ పాక, ఎం.రాధ, బాణాల రాంరెడ్డి, వి.భిక్షం తదితరులు ఉన్నారు.