పశ్చిమబెంగాల్ పురూలియా జిల్లాలో 18 వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కారు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్షోల్ గ్రామం సమీపాన ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బాధితులు పెళ్లికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ధ్వంసం అయింది. స్థానికులు, అత్యవసర సహాయ బృందం ఆ ప్రమాద స్థలానికి వెళ్లి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వీరు చనిపోయారని ప్రకటించారు. నిర్లక్షంతో ఓవర్స్పీడ్తో వాహనం డ్రైవ్ చేయడమే ప్రమాదానికి దారి తీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గురువారం హౌరా సమీపాన బగ్నాన్ వద్ద ప్రయాణికులతో వస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు చనిపోగా, 26 మంది గాయపడ్డారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంపై రోడ్డు భద్రతా ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని తెలుస్తోందని రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు సువేందు అధికారి తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రమాదాల్లో విలువైన జీవితాలను కోల్పోవడం బాధగా ఉందని, మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రతిరోజూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో రోడ్ల భద్రతపై కూడా దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు.