బెంగళూరు: తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కలుసుకొనేందుకు చిన్నస్వామి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన విషయం తెలిసిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో పోలీసులు వారిని నియంత్రిచ లేకపోయారు. స్టేడియంలోకి తోసుకుంటూ వస్తున్న అభిమానుల్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
అయితే బయట పరిస్థితి ఎలా ఉన్నా స్టేడియంలో వేడుకలు జరుగుతున్నాయి. మ్యాచ్ విజయంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కెప్టెన్ రజత్ పాటిదర్ ట్రోఫీ అందుకొనే ముందు చెప్పిన ‘ఈ సాలా కమ్ నమ్దు’ అని అన్నాడు. ‘మనం సాధించాం. ఇది కేవలం నాదో లేక ఆటగాళ్ల విజయం కాదు ఇన్ని సంవత్సరాలు మా జట్టుకు మద్దతు ఇస్తున్న మీ అందరి విజయం. ఆర్సిబికి సపోర్ట్ చేస్తున్న ఈ అద్భుత నగర ప్రజలకు సంబంధించిన విజయం’ అని అన్నాడు. అయితే కోహ్లీ కానీ, ఇతర ఆటగాళ్లేవరూ బయట జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడలేదు. అయితే వాళ్లకి బయట జరిగిన విషయం తెలిసి ఉండకపోవచ్చని.. అందుకే మాట్లాడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.