Wednesday, May 28, 2025

పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు:దిల్‌రాజు

- Advertisement -
- Advertisement -

నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ “కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితికి తెరదించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి ధన్యవాదాలు. ఈస్ట్ గోదావరిలో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు. పవన్ కళ్యాణ్ సినిమాలని ఆపే దమ్ము ఎవరికీ లేదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటాయి. మన సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం. ఈ రోజుతో దీనికి తెరదించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఏప్రిల్ 19లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక మీటింగు జరిపారు.

పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని ఎగ్జిబిటర్స్ కోరారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే, రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నా. ఈ విధానంలో ఎగ్జిబిటర్స్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది మా అందరికీ తెలుసు. పర్సంటేజ్ అయితే బాగుంటుందని వాళ్ళు అక్కడ కోరుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ అంగీకారం చెప్పలేదు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన. సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తర్వాత డేట్‌ను వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది. నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఆ నలుగురు అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం.

పర్సంటేజ్ అంశం తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి ఎగ్జిబిటర్లు దానిని శిరీష్ దృష్టికి తీసుకొచ్చారు. 20 ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో వ్యాపారం అనుబంధం ఉంది. ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగటం తప్పు లేదు. మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్ జరిగింది. చివరి పదిహేను నిముషాలలో మీటింగ్ కి వెళ్లాను. ఛాంబర్ లో ఏం జరిగిందో క్లారిటీ లేకుండానే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని మీడియా వార్తలను ప్రచురించింది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించాను. దీనికి అక్కడ అందరూ ఏకీభవించారు. ఛాంబర్‌కు వాళ్లు పర్సంటేజీ విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగపోతే బంద్ చేస్తామనేది అక్కడ సారాంశం. కానీ బయటికి జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అనే వార్త వచ్చింది. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై వచ్చిన వార్తలను ఖండించక పోవడం తప్పు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. జూన్ ఫస్ట్ నుంచి ధియేటర్స్ కొనసాగాలని వారు కోరుకున్నారు. కోవిడ్ లో తప్పితే నా 30 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ కూడా థియేటర్స్ బంద్ చేయలేదు. సినిమాలు ఉంటే ప్రదర్శించాలని అనుకుంటారు ఎగ్జిబిటర్స్.

బంద్ చేస్తే వాళ్లకే నష్టం. 56 రోజులు నిర్మాతలుగా మేము షూటింగ్ ఆపాము కానీ ఏమీ సాధించలేకపోయాం. జూన్ 1 నుంచి బంద్ అనే వార్త అప్పటికే ప్రచారం అయిపోయింది. తర్వాత నిర్మాతల మీటింగ్ జరిగింది. నిర్మాతలంతా కూడా ఎగ్జిబిటర్స్‌కి సమస్యలు ఉన్నాయని ఏకగ్రీవంగా చెప్పారు. దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాం. అంతేగాని థియేటర్స్ బంద్ చేయడం వద్దు అని నిర్ణయించాం. జాయింట్ మీటింగ్‌లో క్లారిటీగా చెబుదామని నిర్ణయించాం. 24న జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈలోగా సమస్య కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వైపు మళ్లింది. కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. థియేటర్స్ మూయడం అనేది నా అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ నాతో మాట్లాడడం జరిగింది. ఆయనకి క్లారిటీగా చెప్పాను. థియేటర్స్ బంద్ చేయడం జరగదు అని జాయింట్ మీటింగ్ లో నిర్ణయం చేయడం జరిగిందని వివరించాను. మే 30న భైరవం సినిమా వస్తుంది. జూన్ 5న కమలహాసన్ సినిమా, జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా, జూన్ 20న కుబేర… ఈ నెల అంతా వరుసగా సినిమాలు ఉన్నాయి.

అలాగే జూలైలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే అందరి ఉద్దేశం. సినిమా వాళ్లకు రెండూ ప్రభుత్వాలు చాలా ముఖ్యం. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండాలనే సీఎం రేవంత్‌రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పెట్టారు. కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. గతంలో ప్రతిదానికి భయం భయంగా వుండేది. కళ్యాణ్ వచ్చాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకొని వస్తున్నారు. అందరం కలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ. ఇక ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఉంది. అక్కడ 20 థియేటర్లు ఉన్నాయి. 30 ఏళ్ల జర్నీలో మంచి మంచి సినిమాలు చేస్తూ ఒక నిర్మాతగా ఎదిగాను. ఇప్పుడు కూడా ప్రతిక్షణం కొత్తగా ఆలోచిస్తున్నాను. మొన్ననే లార్వెన్ అనే ఎఐ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న దిల్ రాజు డ్రీమ్స్ ప్రకటించాను. కొత్త టాలెంట్ కి నా 30 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగపడేలా చేయాలి అనేది నా ఉద్దేశం.

నేను ఈ ఆలోచనలతో ఉన్నాను. మంచి సినిమాలు తీయాలి. మంచిగా ముందుకు వెళ్లాలి. అందరికీ సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి. మన సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం. ఈరోజుతో దీనికి తెరదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News