బెంగళూరు: 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపిఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ని ఓడించి తొలిసారిగా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ప్రతీ ఆర్సిబి అభిమాని ఆనందానికి అవధుల్లేవు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఆర్సిబి అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ట్రోఫీ విజేతలుగా నిలిచిన ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం బెంగళూరులో ఓపెన్ టాప్ విజయోత్సవ ర్యాలీ (Victory Parade) నిర్వహించాలని ప్లాన్ చేసింది.
కానీ, భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే నేపథ్యంలో ఈ ర్యాలీకి (Victory Parade) పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అభిమానులు నిరాశకి గురయ్యారు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సిబి (RCB) ఆటగాళ్ల సత్కార కార్యక్రమంకు మాత్రం అనుమతి లభించింది. ఈ వేడుకకు కూడా కొన్ని పరిమితులతోనే అనుమతి ఇచ్చారు. టికెట్, పాస్ ఉన్నవారు మాత్రమ స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని పంజాబ్ చేధించలేకపోయింది. 20 ఓవర్లలో పంజాబ్ 184 పరుగులు మాత్రమే చేయడంతో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.