- మేడిపల్లి సర్వేనెంబర్ 103లో గుడిసెలు వేసిన స్థానికులు
- ప్రభుత్వ స్థలం అంటూ కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు
మన తెలంగాణ/బోడుప్పల్: మేడిపల్లి(Medipally) మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వినాయక నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వేనెంబర్ 103లో ఖాళీ స్థలంలో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు 1997లో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని.. కానీ అప్పటి నుంచి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు.
ల్యాండ్ కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులను, నాయకులను కలిస్తే.. హామీలు ఇస్తున్నారు తప్ప తమకు ఎవ్వరు న్యాయం చేయడం లేదని తమ గోడు చెప్పుకొచ్చారు. తమకు కేటాయించిన ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని, బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేసి పట్టాలు ఇచ్చిన ప్రాంతాలని తమకే కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వారికి రెవెన్యూ అధికారులు (Revenue Officers) సహకరిస్తున్నారు తప్పా.. తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.