- త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు శ్రీకారం
- చకాచకా సాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
- ప్రభావిత ఆస్తుల సంఖ్య 886కు కుదింపు
- ఇప్పటికే 550కి పైగా ఆస్తుల కూల్చివేత పూర్తి
- రూ.433 కోట్ల నష్టపరిహారం చెల్లింపు
- మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణాల పనులకు సన్నాహాలు ముమ్మరం
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ పాతనగరం కారిడార్ నిర్మాణ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. అవసరమైన పనులు కీలక దశకు చేరుకున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండి ఎన్విఎస్రెడ్డి వెల్లడించారు. మొ త్తం ఏడున్నర కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వే కు సరిపడేదశకు వచ్చాయన్నారు. విస్తరణ పను లు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వర గా పాత నగరం ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైల్ పట్టాలెక్కించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. మొద ట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచ నా వేసినప్పటికీ, వినూత్న ఇంజినీరింగ్ పరిష్కారాలను అమలు చేయడం వల్ల వాటి సం ఖ్య ఇప్పుడు 886కి వచ్చిందన్నారు. ఇప్పటికే దాదాపు 550పైగా ఆస్తుల కూల్చివేతలు పూ ర్తవుతున్నాయని, మిగతా ఆస్తులను కూడా విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇ ప్పటి వరకు రూ.433 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్టు చెప్పారు. వర్షాలు, అనేక పండుగలు, మొహర్రం వంటి సందర్భాలలో కూడా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభావిత ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన విద్యుత్ కేబుళ్లు కూల్చివేత, విస్తరణ పనులకు సవాళ్లుగా నిలిచినప్పటికీ, వాటిన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నామని ఎండి చెప్పారు. మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టు ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు ప్రధానంగా అవసరమైన డిజిపిఎస్ సర్వే, భూగర్భంలో వివిధ యుటిలిటీలు, భూ సామర్థ్యం, మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంబడి ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ తదితర ఈ నాలుగు అంశాలపై ఇప్పుడు దృష్టి పెట్టామని, వీటన్నిటితో ప్రాజెక్టు నిర్మాణం సజావుగా జరిగేలా కృషి చేస్తున్నామని మెట్రో ఎండి స్పష్టం చేశారు. సాధారణ పరికరాలను ఉపయోగించే సాంప్రదాయ సర్వేకు భిన్నంగా ఖచ్చితత్వం ఇంకా పెంచేలా ’డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్’ (డిజిపిఎస్) సర్వే విధానాన్ని ఉపయోగిస్తున్నట్టు ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. ఇది అధునాతన సర్వే వ్యవస్థ వేగవంతమైన బహుముఖ కోణంలో డిజిటల్ రూపంలో ఫలితాలను చూపెడుతుందన్నారు.
డిజిపిఎస్ నుండి పొందిన డేటాను పాత నగరంలో గతంలో చేసిన డ్రోన్ సర్వే నుండి పొందిన డేటాతో అనుసంధానించడం జరిగిందని, ఈ కసరత్తు వల్ల ప్రాజెక్ట్ అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు. మొత్తం 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాలలో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హై-ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ (జిఎన్ఎస్ఎస్) రిసీవర్లను, నిర్దేశిత ప్రదేశాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నామన్నారు. ఉపగ్రహాల నెట్ వర్క్ ద్వారా పొందిన సిగ్నళ్ల ఆధారంగా ఈ స్థానాలను ఖచ్చితంగా గుర్తిస్తామని, ఇవి మెట్రో పనుల సర్వే, మ్యాపింగ్ లో కీలకమైనవి అవుతాయని చెప్పారు.
మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణ పనుల సన్నాహాలు ముమ్మరం
మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకులను అంచనా వేసి వాటిని వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్ట్ లో చాలా కీలకమైన పని అని ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు. రోడ్లు చాలా పురాతనమైనవి కావడం వల్ల రోడ్డు కింద అనేక నీటి సరఫరా లైన్లు, మురుగునీరు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీలు ఉన్నాయన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి, ప్రభావిత ఆస్తులను కూల్చివేస్తున్నామని తెలిపారు. మెట్రో స్తంభాల పునాదులను వేసే ముందు భూమి కింద ఉన్న యుటిలిటీలను పక్కకు మళ్లించడంలో హైదరాబాద్ జల మండలి, జిహెచ్ఎంసి, టిజిఎస్పిడిసిఎల్, బిఎస్ఎన్ఎల్ ఇతర ఏజెన్సీల సహకారం కోరామని చెప్పారు. యుటిలిటీలను గుర్తించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) సర్వేను చేపట్టామన్నారు. జిపిఆర్ సర్వే అనేది రాడార్ను ఉపయోగించి భూతలం క్రింద ఉన్న మట్టిలో వస్తువులు, నిర్మాణాలను పసిగట్టవచ్చని ఆయన చెప్పారు.
ఇక ప్రాజెక్టు చేపట్టే ప్రదేశంలో ఎలాంటి మట్టి ఉంది, అది ఎంత బలంగా ఉంది, అది మెట్రో కట్టడాల బరువును ఎంతవరకు తట్టుకోగలదు, భూగర్భంలో నీరు ఊరుతున్న పరిస్థితి ఉందా మొదలైన వాటిని తెలుసుకోవడానికి భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎన్విఎస్ రెడ్డి వివరించారు. మెట్రో అలైన్మెంట్కు దారిలో చాలా సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని, వీటిని మెట్రో నిర్మాణ సమయంలో, తర్వాత కూడా సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యమైన అంశం అని తెలిపారు. ఈ నిర్మాణాలను ప్రణాళిక దశలోనే గుర్తించి తదనుగుణంగా అలైన్మెంట్ చేయడం జరిగిందన్నారు. ఈ అలైన్మెంట్ ప్రకారం పిల్లర్ల స్థానాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. అందు వల్ల మెట్రో పనులను సజావుగా చేపట్టడానికి నిర్దేశిత నిడివిలో 100 మీటర్లకు ఒకటి చొప్పున మైలు రాళ్ళను ఏర్పాటు చేస్తున్నామని ఎండి వివరించారు. మెట్రో పనులు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిరంతరాయంగా జరిగేందుకు ముందస్తు సాంకేతిక పరమైన అన్ని చర్యలను చేపట్టామని ఈ కీలక దశ దాటిన వెంటనే మెట్రో రైల్ నిర్మాణాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
Also Read: పారిశుద్ధ్య కార్మికుడు మృతి.. రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కెటిఆర్ డిమాండ్