దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఆపరేషన్ కగార్
జూన్ 23న ఛలో రాజ్ భవన్ కార్యక్రమం
ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఆపరేషన్ కగార్ అని ఎఐవైఎఫ్ ఆరోపించింది. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు, అమాయక గిరిజనులపై క్రూర దాడులు జరిపి భయానక నరమేధాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిసోతందని ఈ నరమేధ చర్యలు వెంటనే ఆపాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆదివారం హిమాయత్ నగర్ లోని ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయం(సత్య నారాయణ రెడ్డి భవన్)లో జరిగింది.
ఈ సందర్భంగా వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలన్నారు. అటవీ సంపద, ఖనిజాలు, వనరులు, భూమిని అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్ అని విమర్శించారు. మావోయిస్టుల హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్యగా సృష్టించి కేంద్రం బూటకపు ఎన్కౌంటర్లను చేస్తున్నదని అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమస్యగా పరిగణించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు.
ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మావోయిస్టులపై దాడుల పేరుతో ఆదివాసీలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే మావోయిస్టులు కాకుంటే మరో రూపంలో ప్రతిఘటన వస్తుందన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకొస్తారని చెప్పారు.
అందుకే ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జూన్ 23న
అడవుల్లోని ఖనిజ సంపదను, వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే ‘ఆపరేషన్ కగార్‘ను ఆపాలని,ఆదివాసీలపై దమనకాండను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.