పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగిన సంగతి తెలిసిందే. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది. అత్యంత సాహసోపేతమైన ఈ ఆపరేషన్ సిందూర్ దాడులు భారత్ చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం. ఇంతటితో ఆగిపోకుండా పాక్లో ఉగ్రవాదులు ఎక్కడ దాగున్నా లోపలికి చొరబడి ఆపరేషన్ సిందూర్ దాడులు కొనసాగుతుంటాయని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉగ్రమూకలకు శిక్షణ కేంద్రంగా తయారైన పాక్ ప్రభుత్వ ఉగ్రవాద అనుకూల విధానాలను ఎండగడుతూ భారత్ వాణిని బలంగా ప్రపంచ దేశాలకు స్పష్టం చేయడానికి కేంద్రం పంపించిన ప్రతినిధి బృందాలు 32 విదేశాల రాజధానుల్లో, యూరోపియన్ యూనియన్లో పర్యటించాయి.
ఈ ఏడు బృందాల్లో మొత్తం 59 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో చాలావరకు పార్లమెంట్ సభ్యులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు. ఉగ్రవాదంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచ దేశాలకు వీరు చక్కగా అందించగలిగారు. నిర్దేశించిన లక్షం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ ప్రతినిధి బృందాలతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ప్రతినిధుల పర్యటన అనుభవాలను తెలుసుకుని వారిని ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు భారత్ అందించే సందేశం విదేశీ ప్రభుత్వాలకే కాదు, చట్టసభ్యులకు, విదేశీ మీడియా, సామాన్య ప్రజానీకం వరకు చేరాలన్నదే భారత ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాదు, ముఖ్యంగా ఏయే దేశాల్లో భారత్కు మద్దతు లభించదని భావిస్తుంటారో ఆ దేశాలకు కూడా ఈ సందేశం అందించడం విశేషం. భారత ప్రతినిధి వర్గం సందర్శించిన దేశాలు చాలావరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలు. భద్రతా మండలి అశాశ్వత సభ్యులుగా ఉన్నవి.
వచ్చే సంవత్సరం భద్రత మండలిలో సభ్యత్వం పొందనున్నవి కూడా ప్రతినిధి బృందం సందర్శించిన వాటిలో ఉన్నాయి. ఇది చాలా అవసరం. ఎందుకంటే 2025 26 సంవత్సరానికి సంబంధించి భద్రతా మండలి సభ్యదేశంగా పాకిస్థాన్ ఎన్నికైన నాటి నుంచి భారత్కు భద్రతా మండలి తీర్మానాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. ఏదైనా ప్రపంచ స్థాయి సమస్యలపై మండలి తీర్మాన పాఠాన్ని కూడా మార్పు చేయగలదు. పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమన్న కశ్మీర్లోని ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (Resistant Front) ప్రకటించినప్పటికీ దాన్ని ఉదాహరణగా చూపించడానికి పాక్ ఒప్పకోవడం లేదు. ఆ మేరకు భద్రతా మండలి తీర్మాన పాఠంలో ప్రస్తావించినా మార్పు చేసే తెలివి పాకిస్తాన్కు ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి కీలక బాధ్యతలు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్గా పాక్ ఎన్నిక కావడమే కాకుండా తాలిబన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా పాక్ చేపట్టడం విడ్డూరం. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఐక్యరాజ్యసమితి తీర్మానాల ద్వారా జవాబుదారులుగా నిలబెట్టడానికి భారత్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఫైనాన్షియల్ టాస్క్ఫోర్సు వద్ద కూడా పాక్కు అడ్డుకట్ట వేయాలని భారత్ ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు మాత్రమే కాక, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ వంటి ప్రపంచస్థాయి సంస్థలకు కూడా పాక్పై వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రతినిధి బృందం న్యూయార్క్, వాషింగ్టన్ వెళ్లినప్పుడు పాక్ చర్యలను ఎండగట్టడంపైనే దృష్టి పెట్టింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని, వాణిజ్య సంబంధాలను ఉపయోగించి అణుయుద్ధం తప్పించగలిగానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా వ్యాఖ్యానించడం కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. అందుకనే అమెరికాలో ప్రతినిధి బృందం పర్యటించడం ఎంతైనా ఇప్పుడు అవసరమేనని దౌత్యవేత్తలు సమర్థిస్తున్నారు.
ఈ పర్యటనలు ఎంతవరకు విజయవంతమయ్యాయో చూస్తే భారత్లో కొన్నివిమర్శలు వినిపించాయి. ప్రతినిధి బృందాలు ఆయాదేశాల్లో భారతీయ సమాజాలతో మాట్లాడడానికే ఎక్కువ సమయం వెచ్చించారని, ఆయాదేశాల్లోని దౌత్యవేత్తలను ప్రభావితం చేయడానికి బదులు భారత మీడియా వర్గాలతోనే ఇంటర్వూలు ఇవ్వడం చేశారని విమర్శలు వచ్చాయి. ప్రతినిధుల బృందాలు పాక్ పట్ల తమ దేశ దృఢమైన వైఖరిని సరిగ్గా వినిపించలేక పాకిస్తాన్, భారత్ మధ్య కుక్కపిల్లి వైరం ఉన్నట్టు వాదించడమే ఎక్కువగా కనిపించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఏదెలాగున్నా భారతదేశ భద్రత, సమగ్రత, ఐక్యతపై జాతీయ స్పృహ ప్రతిబింబించేలా ప్రతినిధి బృందాల విస్తృతమైన సందేశం అత్యంత శక్తివంతంగా పనిచేసింది.
భారత్లో మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని, మెజారిటీవాదమే తీవ్రంగా మారుతోందని అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రతినిధి బృందాలు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఒకే మాటగా, ఒకే బాటగా ప్రపంచానికి భారతదేశ సమైక్యత, భద్రతపై దృఢమైన సంకల్పాన్ని చాటిచెప్పడం ఎంతైనా ముదావహం. ప్రతినిధుల ఎంపికలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలివిగా వ్యవహరించింది. విదేశాల్లో భారత్ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, బహుళ వైవిధ్య భాషా, సాంస్కృతికత చిత్రాన్ని ప్రదర్శించాలన్న దూరదృష్టితో సమర్థులను ఏరికోరి ఎంచుకుంది. రాష్ట్రాలనుంచి, పార్టీలకు అతీతంగా, అనుభం గలిగిన సీనియర్ రాజకీయ నేతలు ప్రతినిధి వర్గాల్లో చోటుచేసుకున్నారు. వీరి లౌకికవాదం, సామరస్యం, సుహృద్భావం ఫలితంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ప్రతిధ్వనులు వినిపిస్తాయన్న అభిప్రాయం కలుగుతోంది.