Saturday, June 14, 2025

ఇదే మంచి అవకాశం

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు (Test matches) సిరీస్‌లో సత్తా చాటి టీమ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ యువ ఆటగాళ్లకు హితవు పలికాడు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ క్రికెటర్లు టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొందన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్షగా మారిందన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంభీర్ సూచించాడు. సీనియర్లు లేని లోటు జట్టుపై పడకుండా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నాడు. ఏదైనా ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకునేందుకు యువ క్రికెటర్లకు ఇదే మంచి తరుణమన్నాడు.

ప్రస్తుతం టీమిండియా ఉన్న స్థితిని రెండు కోణాల్లో చూడొచ్చన్నాడు. మొదటిది.. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్నాం. రోహిత్, విరాట్, అశ్విన్‌ (Rohit, Virat, Ashwin) లు లేకుండా ఆడుతున్న తొలి సిరీస్ ఇదేనని పేర్కొన్నాడు. వీరు లేని లోటు జట్టుపై తప్పక ఉంటుందన్నాడు. రెండో కోణం..దేశం కోసం ఏదైనా చేయడానికి యువ ఆటగాళ్ల చేతుల్లో అద్భుతమైన అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బృందంలో ఆకాంక్ష..అభిరుచి, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిబద్ధత ఉందని తాను భావిస్తున్నట్టు వివరించాడు. జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నాడు.

సర్వం ఒడ్డి పోరాడితే..ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతినీ చిరస్మరణీయంగా మలుచుకునే అవకాశం ఉంటుందన్నాడు. దాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండని సూచించాడు. దేశం కోసం ఆడటం కంటే పెద్ద గౌరవం మరొకటి ఉందన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లకు గంభీర్ పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చాడు. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ రానున్న సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసేలా ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌లతో కలిసి జట్టు సభ్యులతో గంభీర్ భేటి అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News