కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, స్థానిక గుర్రం సవారీవాలా దుర్మరణం చెందారు. ఈ ఘటన ఎప్రిల్ 22న జరిగింది. నెలరోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ దాడుల కర్తలు చట్టానికి దొరడకం లేదు. వీరిని పట్టుకోవడానికి కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున నెలరోజులుగా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి బైసారం పచ్చిక బయళ్లలో ఆరోజు జరిగిన మారణహోమం చివరికి ఆపరేషన్ సిందూరకు దారితీసింది. పహల్గాం ఘటన తరువాత పలు ఎన్కౌంటర్లు జరిగాయి. పలువురు అగ్ర స్థాయి ఉగ్రవాదులు మృతి చెందారు. టెర్రరిస్టు బృందాలకు పెను సవాలు ఏర్పడింది. అయితే ఇప్పటికీ పహల్గాం ఘటనకు బాధ్యులని భావిస్తున్న వారు తప్పించుకుని తిరగడం భద్రతా బలగాలకు సవాలు అయింది.
ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విస్తృత స్థాయి దర్యాప్తు చేపట్టింది. పహల్గాం పరిసరాల్లోని వారిని ఇతరులు మరికొందరిని దాదాపుగా వంద మందిని ఇంటరాగేట్ చేశారు. ఘటనకు వీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆహార పదార్థాల సరఫరా, బస ఏర్పాట్లు, గుర్రపు స్వారీకి తీసుకుని వెళ్లే స్థానిక పొనివాలాలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది ఇప్పటికే దాడికి ప్రధాన కర్తలని భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను అధికారులు విడుదల చేశారు. వీరి కోసంగాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ వీరి ఆచూకీ కానీ జాడలు కానీ ఏ కోణంలోనూ నియా బృందాలు పసికట్టలేకపొయ్యాయి. దాడికి దిగి నెత్తురు పారించి వెళ్లిన వారు చిక్కకపోవడంతో పలు ఇతరత్రా చిక్కులు ఏర్పడుతున్నాయి. వీరు తిరిగి ఏదైనా దాడికి వ్యూహరచన చేస్తారా? స్థానికులు పూర్తి స్థాయిలో వీరికి సహకరిస్తూ వీరిని కాపాడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనుమానిత ఉగ్రవాదుల సమాచారం రహస్యంగా అందించినా అట్టివారికి పెద్ద ఎత్తున బహుమతి ఉంటుందని స్థానికంగా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం సాగించారు. అయితే ఇంతవరకూ ఈ దాడి సూత్రధారులు చిక్కుపడకుండా ఉండటం దర్యాప్తు సంస్థలకు చిక్కులు తెచ్చిపెట్టాయి. వీరు దొరికితే కానీ ఇతరత్రా సమాచారం రాబట్టుకోవచ్చు లేకపోతే దర్యాప్తు ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం అవుతోంది.