పాకిస్థాన్ తన సర్వశక్తులను కూడదీసుకుని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ఐసిఎంబి) తయారు చేసే పనిలో ఉంది. దాదాపుగా 5500 కిలోమీటర్ల దూరం వరకూ అంటే అమెరికా వరకూ లక్షంగా చేసుకుని కూడా దాడి చేయగల సామర్థం ఈ లాంగ్రేంజ్ అణు క్షిపణులకు ఉంది. ఈ విషయం అమెరికా నిఘా సంస్థల కీలక సమాచారం ద్వారా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారతదేశం ఇటీవల సాగించిన ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ అత్యంత రహస్యంగా ఈ ఖండాంతర క్షిపణి తయారీకి తన ఆర్థిక సాంకేతికత వనరులను వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు పసికట్టాయి. ఇటువంటి క్షిపణిని పాకిస్థాన్ సంతరించుకున్నా, ఇందుకోసం తమ ప్రత్యర్థి దేశం చైనా నుంచి సాయం తీసుకున్నా అమెరికా పాకిస్థాన్ను బ్లాక్లిస్టులో పెట్టే వీలుంటుంది. ఇటువంటి దేశాలను అణు ప్రత్యర్థి దేశాల జాబితాలో చేరుస్తారు . అత్యంత రహస్య ప్రదేశంలోఅణు ఆయుధ పాటవ శక్తితో ఉండే ఐసిబిఎం రూపకల్సనకు పాకిస్థాన్
ఇప్పటికే చైనా నుంచి అత్యంత కీలకమైన అణు ఆయుధ ఇతర సాంకేతికతను సంతరించుకుందని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక అందించాయి. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు ఇప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడు పాకిస్థాన్ వైఖరిపై మరింతగా నిఘా వేసేందుకు తగు ఆదేశాలు వెలువరించింది. ఇప్పుడు అమెరికా మూడు దేశాలు చైనా, రష్యా, ఉత్తర కొరియాలను తమ అణు ప్రత్యర్థి దేశాల జాబితాలో చేర్చింది. పాకిస్థాన్ ఈ క్షిపణిని రూపొందిస్తే ఇది నాలుగవ దేశం అవుతుంది. అమెరికా నెలకొని ఉన్న దూరం వరకూ లక్షాలను ఛేదించగల పాటవ శక్తి క్షిపణులను సంతరించుకుంటే సదరు దేశం ఏదైనా అమెరికా మిత్రదేశాల జాబితా నుంచి స్థానం కోల్పోవల్సి ఉంటుంది.అయితే తమ దేశపు అణు కార్యక్రమాలు అన్ని కూడా కేవలం ఆత్మరక్షణకు ప్రత్యేకించి భారత్ దూకుడును నిరోధించుకునేందుకే అని పాకిస్థాన్ తరచూ చెపుతూ వస్తోంది.
లాంగ్ రేంజ్మిస్సైల్స్ తమ ఆలోచనల్లో లేవని, కేవలం దగ్గరి దూరపు లక్షాలు ఛేదించే మిస్సైల్స్ తయారీపైనే దృష్టి సారించామని పాక్ తెలియచేస్తోంది. అంటే కేవలం భారత్లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకోవడం లేదా దాడులను తిప్పికొట్టడం కోసం ఈ క్షిపణి తయారీ ఉంటుందని వెల్లడైంది.అయితే తమ వద్ద ఇప్పటికైతే ఐసిబిఎంలు లేవని పాక్ తెలిపింది. ఇతరత్రా ఆర్థిక పరిస్థితులు , ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నా పాకిస్థాన్ తన యుద్ధ పాటవాన్ని పెంచుకొంటోంది. 2022లోనే పాకిస్థాన్ ఉపరితల , మధ్యస్థ శ్రేణి క్షిపణి షహీన్ 3 రూపొందించుకుంది. ఇది తమ స్థావరం నుంచి 2700 కిలోమీటర్ల దూరపు లక్షాలను ఛేదించగలదు. ఈ క్రమంలో అనుకుంటే భారత్లోని పలు ప్రధాన నగరాలను దెబ్బతీయగలదు. అయితే ఇప్పుడు ఇందుకు మరింత ముందడుగా ఖండాంతర క్షిపణి తయారీకి పాక్ సిద్ధం అయినట్లు వెల్లడికావడం సంచలనం అయింది.