పాకిస్థాన్తో సంబంధాలు పెట్టుకొని ఇండియా సెక్యూరిటీ సమాచారాన్ని పాక్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న అసోంకు చెందిన 19 ఏళ్ల మోఫీజుల్ ఇస్లాంను ఆ రాష్ట్ర పోలీసులు సంగారెడ్డి జిల్లా, గొల్లపల్లిలో పట్టుకున్నారు. భారత్- పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇస్లాంను అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. అసోంకు చెందిన మోఫీజుల్ ఇస్లాం ఇండియా ఫోన్ నెంబర్లతో పాకిస్థానీలకు వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్నాడనే సమాచారం ఆ రాష్ట్ర పోలీసులకు అందింది. అసోంలో ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు లేకుండానే సిమ్ కార్డులు అమ్మాడనే అభియోగంపై ఈనెల 14న గుజరాత్ మిలటరీ ఇంటెలిజెన్స్ అసోం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అసోం పోలీసులు ఆపరేషన్ ఘూస్ట్ సిమ్ను ప్రారంభించారు.
ఈ నెల 16వ తేదీన గొల్లపల్లికి చేరుకొని మోఫీజుల్ ఇస్లాంను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసోంకు చెందిన ఇస్లాం నకిలీ సిమ్ కార్డులతో అకౌంట్లు సృష్టించి జాతి వ్యతిరేక కార్యక్రమాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆ రాష్ట్ర పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇస్లాం అసోంలో మొబైల్ షాప్లో పనిచేసే సమయంలో గుర్తింపు కార్డులు లేకుండా పాకిస్థాన్ గూఢచారిగా ఆ దేశస్థులలకు నకిలీ సిమ్ కార్డులు అమ్మినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొండాపూర్ సిఐ వెంకటేశంను వివరణ కోరగా.. ఇస్లాంను గొల్లపల్లిలో అసోం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అన్నారు. అయితే, తమ వద్ద పూర్తి సమాచారం లేదని తెలిపారు.