సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా మూవీ కుబేర.(Kubera) ఈ సినిమా ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. టీజర్.. ట్రైలర్తో అంచనాలను మరింత పెంచిన ఈ చిత్రం.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ: దీపక్ (నాగార్జున) నిజాయితీగల ఒక సీబీఐ అధికారి. అయితే, తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైలులో ఉంటాడు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్ కు జరగదు. మరోవైపు నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) ఒక పెద్ద పారిశ్రామికవేత్త. (A big industrialist) దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొరుకుతాయి. మంత్రి సిద్థప్ప (హరీశ్ పేరడి)తో రహస్య ఒప్పందం చేసుకుని, ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి అతనిని బయటకు తెస్తాడు. రంగంలోకి దిగిన దీపక్… నలుగురు బిచ్చగాళ్ళను ఎంచుకుని వారి ద్వారా కథ నడుపుతాడు. అలా వీరు ఎంచుకున్న దేవా (ధనుష్) అనే బిచ్చగాడి కారణంగా పరిస్థితులు చేజారిపోతాయి. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నీరజ్ ఇవ్వాల్సిన లక్ష కోట్ల లంచం ముట్ట చెప్పగలిగాడా? ప్రపంచంలోనే అత్యంత ధనికుడిని కావాలనుకున్న నీరజ్ కోరిక నెరవేరిందా? తిరుపతిలో బిచ్చగాడిగా ఉన్న దేవా… ప్రభుత్వాలను శాసించగలిగే కార్పొరేట్ టైకూన్ జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేశాడు? అనేది ‘కుబేర’ కథ.
కథనం, విశ్లేషణ: ధనవంతుడు, పేదవాడు అనే కాన్సెప్టుతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కుబేర సినిమాలో కథనం కొత్తగా ఉంది. జీవితంలో తనకేమీ అక్కరలేదనుకునే ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలు అయినా మరో నిజాయితీ పరుడు.. వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిలా బ్రతికే ఓ బిజినెస్ మెన్.. మొత్తానికి ఈ పాత్రల మధ్య డ్రామాతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమాని స్పెషల్ మూవీగా మార్చేశాడు శేఖర్ కమ్ముల. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయాడు. నిజాయితీగా బతకాలనుకుని.. తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్లో నాగ్ కనిపించాడు. ఆయన కెరీర్లో ఇది నిలిచిపోయే క్యారక్టర్ అవుతుంది. క్యారెక్టర్ ముగింపు కూడా ఎమోషనల్ గా బాగుంది. బిచ్చగాడిగా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియెన్స్ని సర్ప్రైజ్ చేశాడు. దేవా పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం.
ధనుష్ నటన ఆ స్థాయిలో ఉంది. హీరోయిన్ గా రష్మిక మందన్న మరోసారి అద్భుతమైన నటనను కనబరిచింది. తనదైన శైలిలో నటించి ఆమె మెప్పించింది. విలన్గా జిమ్ సర్భ్ చక్కగా నటించాడు. అలాగే దిలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయనలతో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఇక లక్ష కోట్ల స్కాం కథ, బాగా డబ్బున్న వాళ్ళకి, ఏమి లేని వాళ్ళకి మధ్య జరిగిన ఈ డ్రామాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు. రైటర్ కమ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తనకు అలవాటైన దారి నుంచి పక్కకు వచ్చి ఒక గొప్ప కథను చూపించాడు. తన కెరీర్లో ఎంతో వైవిధ్యమైన.. అలాగే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘కుబేర’ నిలుస్తుంది.