పాలక మండళ్లు లేక నిలిచిపోయిన
కేంద్ర నిధులు బిసిలకు
42శాతం రిజర్వేషన్ల కోసం
కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి కేంద్రం
సహకరించకపోతే పార్టీ పరంగా
బిసిలకు 42శాతం సీట్లు
ఎన్నికలకు వెళ్లే యోచనలో
కాంగ్రెస్ హైకమాండ్?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూన్ లేదా జులైలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు లు ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేం ద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోం ది. బిసి రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బిసిలకు 42 శాతం సీట్లు ఇచ్చిన ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పంచాయతీల పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది.దీని ఫలితంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ముగియ గా.. అప్పటినుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ‘
పంచాయతీల్లో పాలకమండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో ఏడాదిగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ నిధులను కోల్పోవాల్సి వస్తుందన్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10వతేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ, సామాజిక పరిస్థితులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో పార్లమెంట్లో బిసి బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయనున్నది. ఏప్రిల్, మే నెలల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. బిసి రిజర్వేషన్లపై అంశంపై కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన వస్తే బిల్లు ఆమోదం పొందే వరకు వేచిచూడాలని, లేనిపక్షంలో జూన్ లేదా జులై నెలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బిసిలకు 42 శాతం సీట్లు ఇచ్చిన ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేలా సిద్ధమైన అధికార యంత్రాంగం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేలా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమై ఉన్నది. ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్దం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండేలా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఒకపక్క అధికార యంత్రాంగం స్థానిక సమరానికి సన్నద్ధమవుతుండగా, మరోవైపు పార్టీలు సైతం వ్యూహాలను పదునుపెడుతున్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. ఆయా పార్టీల వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది.