సంగారెడ్డి: ప్రియురాలి కళ్ల ముందు చెట్టుకు ఉరేసుకొని భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘురాసంగానికి చెందిన ఉమాకాంత్ అనే యువకుడు సంగారెడ్డిలోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పాశమైలారం ప్రాంతం హెచ్ఆర్కె అగర్బత్తీల పరిశ్రమలో యువకుడు పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే యువతితో పరిచయం ఏర్పడడంతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ప్రేమపెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. బుధవారం సాయంత్రం గణేశ్గడ్డలో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు.
పెళ్లి చేసుకుందామా? అని యువతిని యువకుడు అడగడంతో పెద్దలు ఒప్పుకోవడంలేదు కదా? అని సమాధానం చెప్పింది. ప్రేమ పెళ్లికి వాళ్లు ఒప్పుకోవడం లేదు, నువ్వు ఒప్పుకోవా? అని ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆమె చున్నీ తీసుకొని చెట్టుకు ఉరేసుకున్నాడు. వెంటనే ఆమె ఏడుస్తూ కేకలు వేయడంతో స్థానికులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఉమాకాంత్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.