పట్నా: నిర్లక్ష్యంగా, అతి వేగంగా కారు నడిపిన ఓ డ్రైవర్ ఓ ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. శ్రీకృష్ణపురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అటల్ పాత్పై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఓ మహిళ కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా.. అతి వేగంగా వచ్చిన స్కార్పియో కారు.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. మిగిత ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరార్ అయ్యాడు. వాహనంలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.