ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలకు ఒకవంక ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవంక పరస్పరం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో రెండోసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగినా గంటలోనే ఎటూ తేలకుండా ముగిసిపోయాయి. కాల్పుల విరమణ ప్రసక్తి లేకుండా యుద్ధఖైదీల మార్పిడిపై మాత్రం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చర్చలకు 24 గంటల ముందు రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు ఆదివారం రష్యా సైనిక స్థావరాలు అయిదింటిలో భారీ విధ్వంసం సృష్టించాయి.
అంతకు ముందు రష్యా రెండుసార్లు ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపించింది. రానురాను ఈ పరస్పర దాడుల పరిణామాలు ఎంతవరకు సాగుతాయో చెప్పలేం. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మొదటినుంచి అండదండలుగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత నచ్చచెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణలను, దాడులను ఆపడంలేదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు భారీ సంఖ్యలో డ్రోన్లను సరఫరా చేయడానికి బ్రిటన్ సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కు లక్ష డ్రోన్లు అందజేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులో ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ భాగమని పేర్కొంది.
ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్లో రష్యా భూభాగంలో ఉక్రెయిన్ తొలిసారి దాడులు మొదలు పెట్టింది. గత మూడేళ్లుగా డ్రోన్ల వినియోగంలో తన సామర్థాన్ని ఉక్రెయిన్ మెరుగుపర్చుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి జరుగుతుందని, అపార నష్టం సంభవిస్తుందని రష్యా ఊహించలేదు. ఈ దాడుల్లో రష్యా టియు 95, టియు 120 విమానాలు విధ్వంసం అయ్యాయి. వీటిని రష్యా తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్లు ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు అంచనాగా చెబుతున్నారు. రష్యా దాడులవల్ల గత మూడేళ్లలో ఉక్రెయిన్ వేలాది మంది సైన్యాన్ని కోల్పోయినప్పటికీ పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ నిలబడగలుగుతోంది. నల్లసముద్రంలో రష్యా రణతంత్ర వ్యూహాలను ఛేదించడానికి డ్రోన్ల వినియోగంపైనే ఉక్రెయిన్ ఆధారపడుతోంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టిలో జెలెన్స్కీ పిపీలికం. ఎలాగైనా జెలెన్స్కీని పాదాక్రాంతం చేసుకోవాలన్న కక్ష పుతిన్లో పోవడం లేదు. అందుకే కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకరించినా పుతిన్ ఒప్పుకోవడం లేదు. కాల్పులు విరమణ కావాలంటే అనేక షరతులను పుతిన్ముందుకు తీసుకు వస్తున్నారు. ఉక్రెయిన్లో తాము ఆక్రమించుకున్న భూభాగాలను విడిచిపెట్టాలని, నాటో కూటమిలో ఉక్రెయిన్ సభ్యత్వం పొందరాదని, భవిష్యత్తులో యుద్ధానికి సిద్ధపడబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పుతిన్ ఆంక్షలు విధిస్తున్నారు. అసలు ప్రత్యక్షంగా తమతో చర్చలకు జెలెన్స్కీ సరిపోడని పుతిన్ అభిప్రాయం. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 40 నెలలు గడుస్తోంది.
రెండు దేశాల మధ్య విసుగు, అలసట ఛాయలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ భూమిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్కు ఆయుధాల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది. అందుకనే వినూత్నమైన డ్రోన్ దాడులను నిర్వహించడం ద్వారా తన దుర్బలత్వాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ తన ఖేర్సన్ సిటీని కోల్పోయిన తరువాత తాను కోల్పోయిన భూభాగాల్లో 2022 నుంచి ఎలాంటి విజయాలను సాధించలేదు. గత ఏడాదిగా 5000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ రష్యా వల్ల కోల్పోయింది. ఉక్రెయిన్ ముట్టడించిన కుర్స్ను రష్యా తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. రష్యా స్ప్రింగ్ (వసంత) దాడి ఇప్పుడు ఊపందుకోంది.
సుమీ రీజియన్లో భూభాగాలను ఆక్రమించుకుంటోంది. ఉక్రెయిన్ వారాంతపు రష్యా వైమానిక దాడులతో చుట్టుకుపోతోంది. దీనికితోడు సైనిక బలగాల తీవ్ర కొరత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో మద్దతు కొనసాగడంలో అనిశ్చితి ఇవన్నీ ఉక్రెయిన్కు తీరని ప్రతిబంధకాలుగా వెంటాడుతున్నాయి. మరోవంక రష్యాకు కూడా తమ ఇంధన వనరులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను నివారించడం కష్టంగా కనిపిస్తోంది. అలాగే నల్లసముద్రంలోని రష్యా దళాలపై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం రష్యాకు కలవరం కలిగిస్తోంది. రష్యా యుద్ధ రంగంలో ఏమాత్రం దూకుడు పెంచినా ఉక్రెయిన్నుంచి ఎదురుదాడి తప్పదు.
ఇదే విధంగా యుద్ధం కొనసాగితే రెండు వైపులా అపార నష్టం తప్పదు. ట్రంప్ చొరవతో ప్రారంభమైన శాంతి చర్చలు కొద్దిపాటి పురోగతిని అందించాయి. ఈ సమయంలో ట్రంప్ తప్పుకోకూడదు. రష్యాకు చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. భవిష్యత్తు భద్రతా సమస్యలున్నాయి. ఇవన్నీ పరిష్కరించవలసి ఉంది. అయితే భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా ఉండేందుకు విశ్వసనీయమైన భద్రతా గ్యారంటీలను రష్యా నుంచి ఉక్రెయిన్ ఆకాంక్షిస్తోంది. ఈ విభేదాలను పరిష్కరించడంలోను, కాల్పుల విరమణ ఒప్పందం ఉభయ దేశాల మధ్య కుదర్చడం లోనూ కీలక సూత్రధారి అమెరికా ప్రభుత్వమే. ఇస్తాంబుల్లో రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో కనీసం ఈ నెలాఖరులోగా రెండు దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన ప్రతిపాదన సమంజసమే అనిపిస్తోంది.