Monday, June 23, 2025

ధాన్యం టెండర్ల స్కాంపై మౌనం ఎందుకు?:పెద్ది సుదర్శన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ధాన్యం టెండర్లలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాంపై అసెంబ్లీలో కెటిఆర్, హరీష్ రావు మాట్లాడినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బిఆర్‌ఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు 16 సార్లు వాయిదా కోరడంలో అంతర్యం ఏంటని నిలదీశారు. అన్ని ఆధారాలతో విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు.తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలు వై సతీష్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం టెండర్లలో కేవలం నలుగురు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారని అన్నారు.

మద్దతు ధరకు మించి మిల్లర్ల వద్ద రూ. 2230లకు క్వింటాల్ చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేశారని.. ఇందులో 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపారని చెప్పారు. దీనిపై 270 మంది బ్యాంకు ఖాతాలు సేకరించి నగదు బదిలీ అయినట్టు ఆధారాలతో బిఆర్‌ఎస్ బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్‌లో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అక్రమాల ద్వారా సమకూరిన రూ.1100 కోట్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు, అందులో కొంత మొత్తాన్ని ఢిల్లీకి మూటలు పంపారని విమర్శించారు. ధాన్యం కుంభకోణంపై ప్రభుత్వం స్పందించకుంటే సివిల్ సప్లై కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లైస్ అవినీతిపై కేంద్రమంత్రులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News