సివిల్ సప్లై స్కాంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రధాన పాత్రధారులు
బిఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సివిల్ సప్లైస్ స్కాంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని బిఆర్ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులు అని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సుదర్శన్ మాట్లాడుతూ.. పద్దెనిమిది నెలల క్రితం జరిగిన ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంపై ఇప్పటికే ఎనిమిది సార్లు ప్రెస్మీట్ పెట్టామని, ఇదే అంశంపై అసెంబ్లీలో తమ నేతలు కెటిఆర్, హరీశ్రావు లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని అన్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. రైస్ మిల్లర్ల నుంచి బిడ్డర్లు ధాన్యం టన్నుకు రూ.2230 అదనంగా వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారని ఆరోపించారు.
అక్రమంగా డబ్బులు చేరిన 187 ఖాతాల వివరాలను సేకరించామని తెలిపారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు. తాము సేకరించిన ఆధారాలతో ఇడికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇడితో పాటు సిబిఐ, డైరెక్టరేట్ ఆప్ ఇంటెలిజెన్స్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 700 పేజీలకు పైగా బుక్లెట్ తయారుచేసి దర్యాప్తు సంస్థలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కుంభకోణంలో తప్పకుండా దోషులకు శిక్ష పడుతుందని .. ఎవ్వరూ తప్పించుకోలేరని ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన ఈ కుంభకోణంపై బిజెపి స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ దోపిడీని బయటపెట్టామని అన్నారు. రూ.423 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని చెప్పారు. ఎన్నిసార్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడమే ఈ కుంభకోణం జరిగిందని అనడానికి రుజువని అన్నారు. ఈ అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు.
అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం: గంగుల
ధాన్యం కొనుగోలు టెండర్లలో మొదటి నుంచి అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభుత్వ ఖజానాల్లోకి రావాల్సిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ స్కాంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ఈ కుంభకోణంపై ఎసిబి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల మీద తమకు విశ్వాసం ఉందని, అందుకే రాష్ట్రంతో పాటు కేంద్రంలో దర్యాప్తు సంస్థలకు ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ స్కాంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు.