తెలుగు సాహిత్యాన్ని తన అద్భుత కవిత్వంతో, లోతైన విమర్శలతో, విశ్లేషణాత్మక వ్యాసాలతో కొత్త దిశల్లో నడిపించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాకుండా, సమాజంలో చైతన్యాన్నిరేపే ఒక విప్లవాత్మక శక్తి. ఆధునిక తెలుగు కవిత్వానికి ఊతమిచ్చిన మహోన్నత వ్యక్తిత్వం. శేషేంద్ర సాహిత్య ప్రపంచం వర్ణనాత్మకత, తత్వచింతన, సామాజిక చింతన, భాషా వైవిధ్యం, అంతర్జాతీయ దృక్పథాలతో విస్తరించిఉంది. శేషేంద్ర శర్మ జననం 1927 అక్టోబర్ 20న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడు గ్రామంలో జరిగింది. ఆయన తండ్రి సంస్కృత సాహిత్యంలో ప్రావీణ్యం కలిగిన పూజారి గుంటూరు సుబ్రహ్మణ్య శర్మ. చిన్ననాటినుంచే శేషేంద్రకు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం మీద మక్కువ పెరిగింది.
విద్యాభ్యాసం తొటపల్లి గూడూరు పాఠశాలలో ప్రారంభమై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడిగా, మద్రాసు లా కాలేజీనుండి న్యాయశాస్త్రంలో డిగ్రీతో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మునిసిపల్ కమిషనర్గా ఉద్యోగం చేసినప్పటికీ, సాహిత్యపట్ల ఆయన ఆసక్తి ఎప్పటికీ తగ్గలేదు. శేషేంద్ర శర్మ సాహితీ ప్రస్థానం అసాధారణం. ఆయన కవిత్వంలో ఉన్న అద్భుత ఊహాశక్తి, సామాజిక చింతన, తత్వవిచారణ, వ్యక్తిత్వ విశ్లేషణ తెలుగు కవిత్వాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. కేవలం రూపకాలు, అలంకారాలతోనే కాదు, కవిత్వంలో లోతైన భావాలను మేళవించి సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా రచనలు చేశారు. తన కవిత్వంలో తర్కం, ఆచార విచారం, చరిత్ర బోధ, తత్వచింతన మేళవించి ఒక ప్రత్యేక శైలిని రూపొందించారు. నా దేశం నా ప్రజలు అనే కావ్యం శేషేంద్రగారిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది.
ఇందులో సామాజిక అసమానతలు, దేశభక్తి, మానవీయత వంటి అంశాలను రసప్రధంగా, ఆవేశపూరితంగా వ్యక్తీకరించారు. మంథర, షోడశి -రామాయణ రహస్యాలు, ఆధునిక మహాభారతం, స్వర్ణహంస, సముద్రపు రెక్కలు, నెమలికన్ను వంటి రచనలు శేషేంద్రను ఆధునిక తెలుగు సాహిత్యంలో దృఢంగా నిలిపాయి. మంథరలో భారతీయ తత్వశాస్త్రం పట్ల ఆయన అవగాహన, అంతరంగా పొందిన అనుభూతులు ప్రతిఫలిస్తాయి. షోడశిలో రామాయణంలోని రహస్యాలను లోతుగా పరిశీలిస్తూ శ్రీవరాలను సరికొత్త దృక్పథంలో ఆవిష్కరించారు. శేషేంద్ర వచన కవిత్వం కేవలం వర్ణనాత్మకతకు పరిమితం కాకుండా, జాతీయ, అంతర్జాతీయ సాహిత్య ధోరణులను అద్భుతంగా మిళితం చేసింది. అందులో భాషా వైవిధ్యం, సంస్కృత పదసముపేతం, ప్రతీకలు, చిహ్నాల విశేష ప్రయోగం, శబ్దసౌందర్యం సమ్మేళనం సాహితీ పాఠకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
కవిత్వం అంటే కేవలం భావాలను వ్యక్తీకరించడం మాత్రమే కాదు, అది ఒక చైతన్య ప్రవాహం అని ఆయన నిరూపించారు. శేషేంద్ర కవిత్వం మనసుకు హత్తుకునే రూపంలో, ఒకవేళ వినిపిస్తే సంగీతంలా, చదివితే తత్వ రససుధగా అనిపిస్తుంది. సముద్రం నా పేరు, గొరిల్లా, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, కాలరేఖ, జనవంశమ్ వంటి రచనలు కాలంతో పోరాడే కవిత్వానికి, సమాజాన్ని చైతన్యపరిచే సాహిత్యానికి ప్రతీకలు. శేషేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1994లో నాదేశం నా ప్రజలుకు), తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, విశ్వకవి పురస్కారం లాంటి అనేక ప్రతిష్ఠాత్మక బహుమతులు లభించాయి.
ఆయన రచనలు తెలుగులోనే కాదు, అనేక భాషల్లోకి అనువదించబడి విశ్వసాహిత్యంలోనూ తనదైన స్థానం సంపాదించుకున్నాయి. 2007 మే 30న ఆయన భౌతికంగా మన మధ్య నుండి వెళ్లిపోయినా, ఆయన సాహిత్యమూర్తి తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో శేషేంద్ర శర్మ ఒక మహానామం. ఆయన కవిత్వం, విమర్శ, తత్వచింతనలు ఈ తరానికి మాత్రమేకాదు, రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవనున్నాయి.
రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494
( నేడు గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి )