న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ బుధవారం తన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడగా..అతని సోదరుడు అజయ్ మృతి చెందాడు. చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రమేష్.. ఈరోజు సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అజయ్ మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రమేష్, తన సోదరుడి శవపేటికను భుజాన వేసుకుని, కుటుంబ సభ్యులు, సంతాపకులు డయ్యూలో అంతిమ సంస్కారాల కోసం వెళ్తున్న వీడియో కన్నీరు పెట్టిస్తోంది.
కాగా, ఎయిర్ విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లిన తర్వాత మండుతున్న శిథిలాల నుండి స్వల్ప గాయాలతో రమేష్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న వారందరూ ఈ ఘటనలో మరణించగా.. రమేష్ ఒక్కడే బతికాడు. అనంతరం ఆస్పత్రిలో చేరిన రమేష్ ను ప్రధాని మోడీ పరామర్శించి..మాట్లాడారు. తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.