బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ మెగా రోడ్షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి నిలుచున్నారు. వారంతా వాహనంలో ఉన్న మోడీని స్వాగతించారు. పాట్నా విమానాశ్రయం సమీపంలోని అరణ్య భవన్ నుంచి రోడ్ షో మొదలయింది. బీర్చంద్ పటేల్ మార్గ్లోని రాష్ట్ర బిజెపి కార్యాలయం వద్ద ఇది ముగియనున్నది. ప్రధాని వాహన ర్యాలీలో ప్రజలు పుష్ప రేకులు వెదజల్లారు. అంతేకాక ‘భారత్ మాతకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోడీ బీహార్కు రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు. ఆయన బిజెపి కార్యాలయానికి చేరుకున్నాక రాష్ట్ర పార్టీ నాయకులతో భేటీ కానున్నారు.’
కాగా ఆయన రాజ్ భవన్లో రాత్రి గడుపనున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పాట్నా ఎయిర్పోర్ట్లో కొత్త టర్మినల్ బిల్డింగ్ను ఆవిష్కరించారు. అంతేకాక పాట్నా శివారులో ఉన్న బిహ్తా ఎయిర్పోర్ట్ వద్ద కొత్త సివిల్ ఎన్క్లేవ్కు ఆయన శంకు స్థాపన చేశారు. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కొత్త ప్రయాణికుల టర్మినల్ను రూ. 1200 కోట్లతో నిర్మించారు, కాగా బిహ్తా ఎయిర్పోర్ట్ వద్ద సివిల్ ఎన్క్లేవ్ను రూ. 1410 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ప్రధాని ప్రాజెక్టులను ఆవిష్కరించేప్పుడు ఆయన వెంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి , విజయ్ కుమార్ సిన్హా, తదితరులు ఉన్నారు.