న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టులో చైనాకు వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ చైనాలోని టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సిఒ) సదస్సులో భారతదేశం తరఫున ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. రష్యా అధినేత పుతిన్ ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యే సమ్మిట్లో భారత ప్రధాని ప్రాతినిధ్యం కీలక పరిణామం కానుంది. 2019 తరువాత మోడీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. 20 దేశాల నేతలు పాల్గొనే సదస్సు నేపథ్యంలోనే భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చే వీలుంది.
గల్వాన్ లోయ వివాదం ఇప్పుడు దలైలామా ఉదంతం ఇతర విషయాల దశలో ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్లడం కీలక పరిణామమే కానుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల మోతల దశలో షాంఘై సదస్సు కీలక అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం అవుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఆసియాలో పరస్పర సహకారం దిశలో చైనా ; భారత్లు ముందుకు సాగేందుకు కూడా ఈ సమ్మిట్ ఓ వేదిక అవుతుందని భారత దౌత్యవర్గాలు విశ్లేషించాయి. చైనా పర్యటనకు ముందు ప్రధాని మోడీ జపాన్లో పర్యటిస్తారు. ఆగస్టులోనే ఈ పర్యటన ఉంది. ఆసియా దౌత్య రంగంలో ప్రధాని మోడీ చైనా జపాన్ పర్యటన పట్ల అంతర్జాతీయ ఆసక్తి ఏర్పడింది.