Wednesday, September 17, 2025

నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణాలు: మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచనదినం నిర్వహిస్తున్నాం ” అని మోడీ అన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని కొనియాడారు.

ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు
అణుముప్పులకు నవ భారతం భయపడదని మోడీ అన్నారు. “ఇది నవభారతం. ఎవరికీ భయపడదు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి వారిని మనబలగాలు మట్టుపెట్టాయి. అణుబెదిరింపులకు తలొగ్గదు” అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ అణు బెదిరింపులపై మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు నాడు కథనాలు వచ్చాయి.

తాజాగా ఈ విషయాన్ని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించిన సంగతి తెలిసిందే. భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను వెల్లడించారు. పాకిస్థాన్ బుద్ధిని వారు బయటపెట్టారంటూ దీనిని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యలు చేశారు. పుట్టిన రోజున మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తోన్న ప్రధాని మోడీ.. స్వస్థ్ నారీసశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్యసేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్షంతో ఈ పథకాలను తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News