మోతిహరి (బీహార్): ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ బూటకపు హామీలు ఇచ్చి పేదల దగ్గర భూముల్ని కాజేసిందని, ‘ల్యాండ్ ఫర్ స్కామ్’ను ఉదహరిస్తూ ప్రధాని మోడీ ఆర్జేడీని తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో తూర్పు భారతం అభివృద్ధికి వికసిత్ బీహార్ కీలకమని ఆయన పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం మోతిహరిలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ‘బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్బార్ ఎన్డిఏ సర్కార్ ’ (మరోసారి ఎన్డిఎ ప్రభుత్వం అధికారం లోకి వస్తే నూతన బీహార్ను నిర్మిస్తాం) అనే నినాదాన్ని ఇచ్చారు.
ఆర్జేడి-కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి బాగా లోపించిందని , పేద ప్రజల పేరిట వారు రాజకీయాలు సాగించారని విమర్శించారు. యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తూ దేశం మొత్తం మీద ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు రూ. 1 లక్ష కోట్లు ఖర్చుపెట్టనున్నట్టు చెప్పారు. బీహార్లోని 2400 స్వయం సహాయక గ్రూపులకు గత 45 రోజుల్లో రూ. 1000 కోట్లు విడుదల చేయడమైందని, దేశం మొత్తం మీద 1.5 కోట్ల లక్పతి దీదీలుండగా, వారిలో 20 లక్షల మంది బీహార్లోనే ఉన్నారని పేర్కొన్నారు. మోతిహరిని ముంబై మాదిరి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.