తమ దేశపు పొరుగుదేశం (పాకిస్థాన్) ఉగ్రవాద జన్మస్థలం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉగ్రవాద సవాళ్ల పట్ల నిర్లక్షం వహిస్తే, అది మానవతకు ద్రోహం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాద సమస్యలను ఉపేక్షించడం తగదన్నారు. కెనడాలో జరుగుతున్న జి 7 దేశాల సదస్సులో ఆయన బుధవారం మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నందున , సీమాంతర ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నందున పాకిస్థాన్పై తక్షణ చర్యలు అవసరం అని ఆయన జి 7 దేశాల నాయకుల ఔట్రీచ్ సదస్సులో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎప్రిల్ 22వ తేదీన కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు. పొరుగుదేశం వత్తాసుతోనే ఈ అమానుష చర్య జరిగింది. పాకిస్థాన్ను ఉపేక్షించడం , అమానుషానికి తావు ఇచ్చినట్లే అవుతుందన్నారు. కోటానుకోట్ల మంది భారతీయుల ఉనికి, ఆత్మ, మర్యాదలపై జరిగిన ప్రత్యక్ష దాడి పహల్గాం ఉదంతం అని చెప్పారు.
ఉగ్రవాదం నిరోధక చర్యలలో ద్వంద్వ ప్రమాణాలు తగవు. సమన్యాయం పాటించి , తగు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చెప్పారు. తనకు అర్థం కాని విషయం ఒక్కటే ఉగ్రవాద వ్యాప్తికి పాల్పడుతున్న వారిని, ఉగ్రవాద బాధిత పక్షాలను ఒకే తాసులో ఉంచి చూస్తారా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఇంధన భద్రతపై ప్రధాని మోడీ జి 7 నేతలతో అనుసంధాన ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండే అన్ని దేశాలకు ఉగ్రవాదం శత్రువు అవుతుంది. మొత్తం మానవాళికి ఇది చేటు కల్గిస్తుందని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో , ఏ రీతిలో సమర్థించినా అటువంటి దేశాలపై జవాబుదారి అయ్యేలా చూడాలి, తగు మూల్యం చెల్లించుకుని తీరాల్సిందే అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి ఉగ్రవాదం అణచివేత అత్యవసరం అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యలకు దిగుతున్న దేశాల పట్ల ఎటువంటి చర్యలు లేకపోవడం దారుణం అన్నారు.
మనం ఓ వైపు కొన్ని విషయాలలో మన ప్రాధాన్యతలు, ప్రయోజనాల కోణంలో ఆలోచించుకుని వెంటనే ఆంక్షలకు ఇతరత్రా చర్యలకు దిగుతాం. అయితే ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు తెలిపే దేశాలపైచర్యలు ఉండవు. పైగా వాటికి నజరానాలు అందిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ప్రశ్నలు లేవనెత్తారు. నజంగానే మనకు ఉగ్రవాద అణచివేత చర్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామాఝ ఉగ్రవాదం పిడుగు మన నెత్తిపై పడితే కానీ దీని గురించి అందరికి అర్థం కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదం అణచివేత చర్యల్లో బాధిత పక్షాలకు సరైన న్యాయం జరుగుతోందాఝ ఉగ్రవాదం అణచివేతలో ప్రపంచ స్థాయి సంస్థలు, వ్యవస్థలు సరైన విధంగా పనిచేస్తున్నాయా? విశ్వసనీయత అంటూ ఉందా? అని నిలదీశారు. ఇక్కడి చర్చనీయాంశం అయిన ఇంధన భద్రత గురించి ఆయన మాట్లాడారు. భవిష్య తరాలకు ఇంధన భద్రత కల్పించడం అనేది అత్యంత కీలకమైన సవాలు అన్నారు.
రేపటి తరాలకు ఇంధన భద్రత విషయంలో మనం కేవలం నేను అనుకోకుండా, మన అని భావించుకుని, సమిష్టి ప్రాతినిధ్యంతో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులలో గ్లోబల్ సౌత్ దేశాలు పలు అనిశ్చితలు, ఘర్షణలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రపంచంలో ఏ మూల ఎటువంటి ఉద్రిక్తత నెలకొన్నా దీని ప్రభావం ప్రత్యేకించి ఈ గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్రస్థాయిలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన రంగ సంబంధిత విషయాలను ఆయన విశ్లేషించారు. సాంకేతిక మార్పులు అనేకం జరుగుతున్నాయి. వినూత్న రీతిలో మనకు అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేధ (ఏఐ)నిస్సందేహంగా ఉపయుక్తంగా ఉంటోందన్నారు. అన్ని రంగాలలో సమర్థత పెంపుదల, సృజనాత్మక ఆవిష్కరణలకు ఇది ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఇది అత్యంత శక్తివంతమైన కత్తిమీద సాములాంటిది కూడా అవుతోందన్నారు.