భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం మేరకే మోడీ సరెండరయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం భోపాల్లోని రవీంద్ర భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. స్వల్ప ఒత్తిడి కూడా వారిని భయభ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేస్తుందని బిజెపి-ఆర్ఎస్ఎస్ను ఎద్దేవా చేశారు. “బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులపై కొంచెం ఒత్తిడి తెచ్చినా, వారు భయపడి పారిపోతారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుండి ఫోన్ చేసి.. నరేందర్.. లొంగిపోండి అని అన్నారు. ఇక్కడ, నరేంద్ర మోడీ ‘ఎస్ సార్’ అని యుద్ధం విరమించుకున్నారు” అని రాహుల్ అన్నారు.
1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేస్తూ.. యుఎస్ సెవెంత్ ఫ్లీట్ ముందుకు సాగినప్పుడు.. ఆమె ‘నేను చేయవలసినది నేను చేస్తాను’ అని అన్నారని రాహుల్ పేర్కొన్నారు. “ఇది బిజెపి-ఆర్ఎస్ఎస్ వ్యక్తుల లక్షణం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వారికి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉంది. కాంగ్రెస్ పార్టీ లొంగిపోదు. గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్జీ – వీరు లొంగిపోయే వ్యక్తులు కాదు, అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు” అని రాహుల్ గాంధీ అన్నారు.