న్యూఢిల్లీ: పాకిస్థాన్ తో భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. బుధవారం మోడీ, ట్రంప్తో 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని, ట్రంప్ కు వివరించారు. “జి7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, ట్రంప్ సమావేశం కావాల్సి ఉంది. ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగి వెళ్లడంతో ఈ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో ట్రంప్ అభ్యర్థన మేరకు ఈరోజు ఇద్దరు నాయకులు ఫోన్లో మాట్లాడారు” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ఇద్దరు నాయకులు దాదాపు 35 నిమిషాలు మాట్లాడుకున్నారని ఆయన అన్నారు. “ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ట్రంప్, ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో మద్దతు కూడా తెలిపారు. ఆ తర్వాత వారు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోడీ, ట్రంప్తో వివరంగా మాట్లాడారు” అని ఆయన చెప్పారు.
ఇద్దరి మద్య సంభాషణ సందర్భంగా.. ఉగ్రవాదంపై భారత్ కఠినమైన వైఖరిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో అమెరికా లేదా మూడవ వ్యక్తి నుండి ఎటువంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించదని ట్రంప్కు మోడీ చెప్పారు. కాగా, ఇస్లామాబాద్ అభ్యర్థన తర్వాతే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని మిస్రీ తెలిపారు.