ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చినాబ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. జమ్మూ కశ్మీర్లోనే వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపి, దీనిని జాతికి అంకితం చేస్తారు. చినాబ్ బ్రిడ్జి ప్రపంచంలోని అతి సుందర నిర్మాణ కౌశల ప్రతిభల కట్టడంగా మారింది. దిగువన చినాబ్ నది ప్రవహిస్తూ ఉండగా, 359 మీటర్ల ఎత్తున ఈ వంతెన నిర్మితం అయింది. భూ ప్రకంపనలు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే విధంగా ఇంజనీరింగ్ ప్రతిభను రూపుదిద్దారు, 1315 మీటర్ల పొడవు ఉండే ఉక్కుతో నిర్మితమైన ముఖద్వారపు వంతెన అత్యద్భుత రీతిలో లోయలు కొండలు అరణ్యాల సోయగాల నడుమ నిలిచింది. ఇక జమ్మూ నుంచి శ్రీనగర్కు రవాణా సౌకర్యం తేలిక అవుతుంది. ఇక ఈ బ్రిడ్జి పైనే ప్రధాని ప్రారంభించే వందేభారత్ రైలు పరుగులు తీస్తుంది. కత్రా నుంచి శ్రీనగర్కు ఇది కేవలం మూడు గంటలకు వెళ్లుతుంది.
ఇంతవరకూ ఉన్న ప్రయాణకాలం ఇకపై 23 గంటలు తగ్గుతుందని అధికారులు తెలిపారు. అత్యంత దుర్లభమైన ప్రాంతాల మీదుగా కట్టిన ఈ వంతెనకు అంజీ వారధిగా పేరు పెట్టారు. భారతదేశపు తొలి కేబుల్ నిర్మిత రైలు బ్రిడ్జి ఇదే కావడం దీని మరో ప్రత్యేకత. పహల్గాం ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్కు ప్రధాని మోడీ రావడం ఇదే తొలిసారి . దీనితో పలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం నాటి పర్యటనలో భాగంగానే ప్రధాని మోడీ పలు ఇతర అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తారు. మాతా వైష్ణో దేవి నెలకొని ఉండే కత్రా జిల్లాలో ఇప్పుడు మొత్తం మీద ఈ ప్రాజెక్టుల విలువ రూ 46000 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రారంభించే మరికొన్ని ప్రాజెక్టులలో 272 కిలోమీటర్ల దూరం ఉండే ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ (యుఎస్బిఆర్ఎల్) ప్రాజెక్టు కూడా ఉంది. ఇది జమ్మూ కశ్మీర్లో ప్రజారవాణాకు అత్యంత కీలక వ్యవస్థ అవుతుంది.
దీనిని రూ 43,780 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు. ఇందులో 36 టన్నెల్స్, 943 బ్రిడ్జిలు ఉంటాయి. మిగిలిన దేశంతో కశ్మీర్ లోయను విస్తృతస్థాయిలో అనుసంధానించేందుకు, ప్రాంతీయ స్థాయిలో రవాణాకు, అంతకు మించి స్థానికంగా సామాజిక ఆర్థిక అనుసంధానానికి ఈ మార్గం ఎంతగానో దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. ఇక కత్రాలో జిల్లాలో రూ 350 కోట్ల వ్యయంతో శ్రీ మాతా వైష్ణోదేవి ఇనిస్టూట్ ఆప్ మెడికల్ ఎక్సలెన్సీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. రియాసీ జిల్లాలో ఇకపై సమున్నత స్థాయిలో వైద్య , చికిత్స అనుబంధ సౌకర్యాల కల్పనకు ఈ సంస్థ ఏర్పాటు దారితీస్తుంది.