చోరీ కేసును ఆరు గంటల్లో చేధించి, రూ.46 లక్షల నగదు రికవరీ చేసినట్లు నార్త్ జోన్ డిప్యూటి కమిషనర్ రష్మి పెరుమళ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. పాటిగడ్డలో ఉన్న సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తన కార్యాలయంలో ఉన్న గోద్రెజ్ లాకర్ను పగులగోట్టి రూ.46 లక్షలు దొంగలించారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిందితుడు మధ్యప్రదేశ్లోని పురేలి సరాయ్కు చెందిన గిరిధర్ సింగ్గా గుర్తించారు. నిందితుడు గతంలో ఇదే కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేయగా, ప్రవర్తన సరిగా లేకపోవండంతో ఆరు నెలల కిత్రం ఉద్యోగం నుంచి తొలగించారు. పనిచేసే సమయంలో కార్యాలయంలో నగదు భద్రపరిచే విషయాన్ని
తెలుసుకున్న నిందితుడు చోరీ చేసేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో జూన్ 21వ తేదీ రాత్రి ఆఫీస్ పై కప్పులోని ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి ప్రవేశించి లాకర్ పగలగొట్టి నగదు దొంగలించాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుడు సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని పురేలికి బస్సులో పారిపోతున్నాడని సమాచారం తెలుసుకున్నారు. దీంతో పోలీసులు బస్ డిపోలను, బస్ స్టాండ్లను అప్రమత్తం చేసి, బస్సు డ్రైవర్ ద్వారా నిందితుడి కదలికను ట్రాక్ చేశారు. ఆదిలాబాద్ పోలీసుల సహాయంతో మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద రూ. 46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ మాట్లాడుతూ పనిచేసే ఉద్యోగుల నేపథ్యాన్ని యజమానులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీంతో స్వీయ భద్రత కలుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి గోపాల కృష్ణమూర్తి, ఎసిపి బి.ప్రసాద రావు, జి. శ్రీనివాస్, టి. శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.