Thursday, June 19, 2025

కాంగ్రెస్ హయాంలో సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా ఠాణాలు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ హయాంలో సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మారాయని పోలీసుల తీరు మారాయని సిరిసిల్ల శాసనసభ్యుడు, మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ ఎంపిటిసి, బిఆర్‌ఎస్ నాయకుడు కరికె కుంటయ్య మృతదేహనికి నివాళులు అర్పించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోనే మీడియాతో ఆయన మాట్లాడుతూ..బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు. కరికవేణి కుంటయ్య తమ పార్టీ కార్యకర్త అని, ఈ నెల 16న హైదరాబాద్‌లో తనను ఎసిబి అధికారులు పిలిచినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి తనకు ధైర్యం చెప్పాడని తెలిపారు.ఆరోజు రాత్రికల్లా ఇంటికి తిరిగివచ్చిన తరువాత ఏమైందో గాని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో మంచి వైద్యం అందించాలని పార్టీ నేతలకు సూచించానని అన్నారు.

విషం తాగిన కుంటయ్య కిడ్నీలు ఫెయిలయ్యాయని, దురదృష్టవశాత్తు మంచి కార్యకర్తను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. లోపల తుఫాన్ వంటి బాధలను దాచుకుని ప్రజల కోసం పనిచేసిన కుంటయ్య తనకు అన్యాయం జరుగుతోందని, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే అతనిపైనే కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. పోలీసుల తీరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన కుంటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. పోలీసులు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం పోలీసుల తీరును అదుపులో పెట్టాలన్నారు. కుంటయ్య పెద్దకర్మ వరకు అయ్యే అన్ని ఖర్చులు పార్టీయే భరిస్తుందని అన్నారు. మృతుడి కుటుంబానికి అన్నిరకాలుగా తాము అండగా ఉంటామన్నారు. అతని ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నీ పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఏ సుంకె రవిశంకర్, జడ్‌పి మాజీ ఛైర్మన్ తుల ఉమ, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News