మన తెలంగాణ/ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థ ల ఎన్నికలే ప్రధాన అజెండాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) కీలక సమావేశం ఈ 24న సమావేశం కానున్నది. గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులూ పాల్గొంటారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియామకం తర్వాత ఇదే తొలి సమావేశం కావడం వల్ల ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతేకాకుండా పలు రాజకీయ అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే ప్రధాన అజెండగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు పార్టీని సమాయత్తపరచడంతో పాటు,
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారిన గోదావరి బనకచర్ల లింక్ ప్రా జెక్టు, పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడుతున్న వారిని కట్టడి చేయడం, రైతు భరోసాతో రైతులు సంతృప్తిగా ఉన్నారా? ఇందిరమ్మ ఇండ్లు ఇతరత్రా అంశాలపై మంత్రివర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తారు. రాజకీయ వ్యవహారాల కమిటీ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మంత్రివర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పిఎసి సమావేశంలో వివరిస్తారు. రైతు భరోసా నిధుల విడుదల తర్వాత రైతుల స్పందన ఏ విధంగా ఉందన్న అంశం కూడా చర్చకు రానున్నది. బనకచర్ల వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సమావేశంలో వివరిస్తారు. ప్రభుత్వ పని తీరు బాగున్నా, విపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.
కొత్త కమిటీతో భేటీ
పిఎసి సమావేశానంతరం మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల నియమితులైన పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. అనంతరం పిసిసి ఆఫీసు బేరర్లకు నియామక పత్రాలను అందజేస్తారు. గాంధీ భవన్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు మీనాక్షి నటరాజన్ ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు.