Tuesday, June 24, 2025

బనకచర్ల బంకను మాపై రుద్దే యత్నం

- Advertisement -
- Advertisement -

త్వరలో ఆ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ కోర్టు
తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై నిర్ణయం
క్యాన్సర్ నివారణపై ప్రభుత్వ
సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
క్రీడల అభివృద్ధికి నిధి ఏర్పాటు
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు

* బనకచర్ల బంకను మాపై రుద్దాలన్నది బిఆర్‌ఎస్ ప్లాన్
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం
*కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం * తెలంగాణ క్రీడల అభివృద్ధికి నిధి ఏర్పాటు: మంత్రి వాకిటి శ్రీహరి
 *కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై నిర్ణయం
 *తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం* డిసెంబర్ 2న సంబంధిత డాక్యుమెంట్ ఆవిష్కరణ* క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడి నియామకం * మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెబుతున్నామని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి సచివాలయంలో సోమవారం రాత్రి 10 గంటలకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతులు ఖాతాల్లో వేసినందుకు రాష్ట్ర రైతుల పక్షాన మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. నేడు సెక్రటేరియట్ వద్ద రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించామన్నారు.

గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మర్చిపోతే ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లలో నవంబర్ 9వ తేదీ లోపు లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సుమారుగా 201 కిలోమీటర్ల చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. బనకచర్లలో భాగంగా అప్పటి ప్రభుత్వం 2016 అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టిఎంసీల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, బనకచర్ల అనే బంకను ఈ ప్రభుత్వానికి రుద్దాలని చూసిందని ఆయన ఆరోపించారు.

స్పోర్ట్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు: మంత్రి వాకిటి
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నూతన స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా నూతన స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదించిందన్నారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఒలంపిక్స్‌లో మన యువత సత్తా చూపించాలన్న ఉద్ధేశ్యంతో ఈ పాలసీని రూపొందించామని ఆయన తెలిపారు. 2036లో జరిగే ఒలంపిక్స్‌లో తెలంగాణ తరపున పతకాలను సాధించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా తెలంగాణ క్రీడాకారులకు

మెరుగైన శిక్షణ అందించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వారికి ప్రోత్సాహాలు అందించడం లాంటి చర్యలను చేపడుతున్నామని మంత్రి వాకిటి తెలిపారు. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధి (టిఎస్‌డిఎఫ్)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఈ నిధి ఏర్పాటులో భాగంగా జిల్లాలో క్రీడా అభివృద్ధికి సంబంధించి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ (సిబిఎఫ్) లో పది శాతం ఈ నిధికి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. స్పోర్ట్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సిఎం కప్ రాష్ట్ర స్థా యి విజేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్ విజన్ పాలసీ’ ఆవిష్కరణ: మంత్రి పొన్నం
బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్ తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహారిస్తుందన్నారు. హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు కోర్సులకు గాను

240 సీట్లతోఒ అడ్మిషన్‌ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. శాతవాహన యూనివర్శిటీలో లా కాలేజీ ఏర్పాటులో భాగంగా ఎల్‌ఎల్‌బి సీట్లు 60 సీట్లు, ఎల్‌ఎల్‌ఎం సీట్లు 60 సీట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయను సలహాదారుడిగా నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. దీంతోపాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News