Wednesday, July 23, 2025

కలెక్టర్లే కీలకం

- Advertisement -
- Advertisement -

పథకాలపై కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి
సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి
సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం సరఫరా కావాలి
వారంలో ఒక్కరోజు అధికారులందరూ హాస్టళ్లలో బస చేయాలి
సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, ఆయా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడడం,మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు. రాష్ట్ర మంత్రులు వివిధ అంశాల వారీగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిర్విరామంగా కృషి చేయాలని తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో పథకాల ఫలితాలను వారికి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, దానికగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం సరఫరా

ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణం సాంఘిక, బిసి, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, హాస్టళ్లలో నిర్వాహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒక్కరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు వీటి నిర్వాహణపై పలు సూచనలు చేశారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమారులు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం పరిశుభ్రతల్లో భాగంగా శానిటేషన్‌ను చేపట్టాలని, అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్స్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రేపటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపోలు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణాలో లబ్ధిదారుడినికి ఉచితంగా అందజేయాలని, ఇసుక రవాణా విషయంలో లబ్ధిదారునికి ఎలాంటి భారం కలుగకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రతి వారం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యకార్యదర్శులు నదీమ్, ఎన్, శ్రీధర్, దానకిషోర్, నవీన్‌మిట్టల్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తూ, కార్యదర్శులు లోకేశ్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, విపి గౌతమ్, పిసిసిఎఫ్ సువర్ణ, ఇ.శ్రీధర్, సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News